దేశంలో మరోసారి జికా వైరస్ కేసు వెలుగుచూసింది. మహారాష్ట్రలో ఓవైపు కొవిడ్-19 కేసుల పెరుగుదల ఆందోళన రేకెత్తిస్తుంటే మరోవైపు జికా వైరస్ కేసులు వెలుగుచూడటం కలకలం రేపింది. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాకు చెందిన ఓ ఏడేళ్ల బాలికకు జికా వైరస్ పాజిటివ్గా తేలినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. జిల్లాలోని ఓ గ్రామంలో ఉన్న గిరిజన రెసిడెన్షియల్ పాఠశాలలో ఆమె చదువుకుంటోందని అధికారులు తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జికా వైరస్ కేసు గతేడాది జులైలో పుణెలో నమోదైందని పేర్కొన్నారు.
OYO Offer: ‘ఓయో’ స్పెషల్ ఆఫర్.. అమ్మాయిలకు మాత్రమే..!!
జికా వైరస్ ఏడెస్ అనే దోమ నుంచి మనుషులకు సోకుతుంది. ప్రాణాంతకం కాకపోయినప్పటికీ.. ఇప్పటి వరకూ దీనికి మందు లేకపోవడం ఆందోళన కలిగించే విషయం. ఈ వైరస్ సోకితే కొందరిలో జ్వరం, దద్దర్లు, తలనొప్పి, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. పిల్లలకు సోకితే వారి ఎదుగుదలపై ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తొలుత 1947లో ఉగాండా అడవుల్లో కోతుల్లో ఈ వైరస్ కనిపించింది. 1952లో మనుషుల్లోనూ గుర్తించారు. 2017లో అహ్మదాబాద్, తమిళనాడులో ఈ కేసులు వెలుగుచూశాయి. కరోనా వైరస్ తీవ్రత తగ్గిందని ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో.. ఇటీవలే మహమ్మారి మళ్లీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పుడు మహారాష్ట్రలో జికా వైరస్ కేసు వెలుగు చూడడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.