Shocking Statistics: దేశవ్యాప్తంగా భర్తల మరణాలకు సంబంధించిన ఆందోళనకర గణాంకాలను తాజాగా గురుగ్రామ్కు చెందిన ‘ఏకం న్యాయ్ ఫౌండేషన్’ విడుదల చేసింది. ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. 2026 జనవరి నుంచి జులై 14 వరకు దేశంలో మొత్తం 554 మంది భర్తలు హత్యలు లేదా ఆత్మహత్యల కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఈ నివేదికలో వెల్లడైన వివరాలు సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్గా మారాయి.
ఈ నివేదిక ప్రకారం.. మొత్తం మరణాల్లో 322 మంది భర్తలు తమ భార్యలు లేదా వారి ప్రియుల చేతిలో హత్యకు గురైనట్లు పేర్కొంది. మరో 232 మంది వైవాహిక విభేదాలు, గృహహింస, మానసిక ఒత్తిడి, కుటుంబ కలహాలు వంటి కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించింది. కుటుంబ వ్యవస్థలో పెరుగుతున్న విభేదాలు, దాంపత్య జీవితంలో ఏర్పడుతున్న సమస్యలు కొంతమంది పురుషులను తీవ్ర నిర్ణయాలకు దారితీస్తున్నాయని నివేదికలో ఆ సంస్థ అభిప్రాయపడింది. అయితే ఈ గణాంకాలు ప్రభుత్వ అధికారిక నేర గణాంకాలు కావని, 2026 జనవరి నుంచి జులై 14 వరకు దేశవ్యాప్తంగా వివిధ మీడియా సంస్థల్లో ప్రచురితమైన వార్తలను సేకరించి, విశ్లేషించి ఈ నివేదికను రూపొందించినట్లు ‘ఏకం న్యాయ్ ఫౌండేషన్’ స్పష్టం చేసింది. అందువల్ల ఈ సంఖ్యలను అధికారిక నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) గణాంకాలుగా పరిగణించరాదని కూడా తెలిపింది. వైవాహిక జీవితంలో పెరుగుతున్న వివాదాలు, మానసిక ఒత్తిడి, గృహహింస వంటి అంశాలపై సమాజం, కుటుంబాలు, సంబంధిత సంస్థలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి ఘటనలను తగ్గించేందుకు కౌన్సెలింగ్, చట్టపరమైన అవగాహన, మానసిక ఆరోగ్య సేవలు అందుబాటులోకి రావడం ఎంతో అవసరమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

