30 Jailed For Life In 2011 Rajasthan Murder Case: 2011లో రాజస్థాన్ ను కుదిపేసిన పూల్ మహ్మద్ హత్య కేసులో సవాయ్ మాధోపూర్ జిల్లాలోని ప్రత్యేక కోర్టు తీర్పు వెల్లడించింది. శుక్రవారం 30 మందిని దోషులుగా ప్రకటిస్తూ వారందరికి జీవిత ఖైదు శిక్ష విధించింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విచారించిన ఈ కేసులో 30 మందిని దోషులుగా ప్రకటించగా.. 49 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసును బుధవారం విచారించిన స్పెషల్ కోర్టు శుక్రవారం శిక్షలు ఖరారు చేసింది. శిక్ష పడినవారిలో మాజీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మహేంద్ర సింగ్ కూడా ఉన్నారు. సీబీఐ న్యాయవాది శ్రీదాస్ సింగ్ మాట్లాడుతూ.. ఈ కేసులో డీఎస్పీ మహేంద్ర సింగ్ తో పాటు 30 మందిని దోషులుగా నిర్థారించి జీవిత ఖైదు విధించడంతో పాటు జరిమానా విధించినట్లు వెల్లడించారు.
కేసు వివరాలు:
మార్చి 17,2011న సుర్వాన్ గ్రామంలో ఓ వ్యక్తి హత్య కేసులో పోలీసులు సరిగ్గా వ్యవహరించడం లేదని ఆరోపిస్తూ వాటర్ ట్యాక్ ఎక్కాడు. ఈ సమయంలో పరిస్థితిని చక్కదిద్దడానికి పోలీస్ ఇన్స్పెక్టర్ ఫూల్ మహ్మద్ ఆ గ్రామానికి వెళ్లాడు. వాటర్ ట్యాంక్ పై నుంచి వ్యక్తి దూకేయడంతో గ్రామస్థులు ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. ఆ ప్రాంతంలో మరపరమైన అల్లర్లు జరిగాయి. అక్కడికి వచ్చిన పోలీస్ ఇన్స్పెక్టర్ ఫూల్ మహ్మద్ పై రాళ్లతో దాడి చేశారు. జీపులో తప్పించుకునేందుకు ప్రయత్నించిన ప్రజలు రాళ్లదాడి చేస్తూనే ఉన్నారు. దాడిలో తీవ్రంగా గాయపడిన పూల్ మహ్మద్ అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. ఈ క్రమంలో గుంపు పోలీస్ వాహనానికి నిప్పు పెట్టి, పూల్ మహ్మద్ ను సజీవ దహనం చేసింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అయింది. మరణించిన తర్వాత రాజస్థాన్ రాష్ట్రప్రభుత్వం పూల్ మహ్మద్ కు అమరవీరుడి హోదా కల్పించడంతో పాటు ఈ ఘటనపై సీబీఐ ఎంక్వైరీ అప్పగించింది.