Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాలకు కీలక విజయం లభించింది. ఇటీవల కాలంలో కేంద్రపాలిత ప్రాంతంలో ఉగ్రవాదులు రెచ్చిపోతున్న తరుణంలో ఇద్దరు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు ఈ రోజు మట్టుపెట్టాయి. బారాముల్లాలోని రఫియాబాద్ ప్రాంతంలో బుధవారం ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఎదురుకాల్పుల్లో ఒక పోలీస్ అధికారికి గాయాలయ్యాయి. ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. అంతకుముందు సోమవారం బందిపొరా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఆదివారం రాత్రి బందిపోరా జిల్లాలోని ఆరగాం ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం మేరక భద్రతాబలతగాలు కార్డర్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ సమయంలోనే ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి.
గత 10 రోజులుగా జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా ఉగ్రవాద ఘటనలు పెరిగాయి. ప్రధాని నరేంద్రమోడీ మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన గత ఆదివారం రోజున రియాసి జిల్లాలో శివ్ ఖోరా నుంచి ఖత్రా వెళ్తున్న యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 10 మంది మరణానికి కారణమయ్యారు.ఈ ఘటన జరిగిన రెండు రోజుల్లోనే కథువా, దోడా జిల్లాల్లో ఉగ్రవాద ఘటనలు జరిగాయి. కథువా జిల్లా ఎన్కౌంటర్ ఇద్దరు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. ఆ తర్వాత నుంచి జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా ఉగ్రవాదుల వ్యతిరేక ఆపరేషన్ని భద్రతా బలగాలు ముమ్మరం చేశాయి.