Prashant Kishor: వరల్డ్ బ్యాంక్ డబ్బుతో గెలిచారు.. ఎన్డీయేపై ప్రశాంత్ కిషోర్ పార్టీ ఆరోపణ..

  • వరల్డ్ బ్యాంక్ డబ్బు ఉపయోగించి గెలిచింది..
  • బీహార్‌లో ఎన్డీయే గెలుపుపై ప్రశాంత్ కిషోర్ పార్టీ ఆరోపణలు..
Prashant Kishor

Prashant Kishor

Prashant Kishor: బీహార్ ఎన్నికల్లో కింగ్ మేకర్ అవుతారని అంతా భావించిన జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ ఘోరంగా విఫలమయ్యారు. రాష్ట్రంలో ఒక్క సీటులో కూడా ఆ పార్టీ అభ్యర్థి విజయం సాధించలేదు. ఎన్డీయే సునామీలో ఆర్జేడీ లాగే ప్రశాంత్ కిషోర్(పీకే) కొట్టుకుపోయారు. అయితే, పరాజయంపై తొలిసారిగా స్పందించిన పీకే పార్టీ, ఎన్డీయేపై సంచలన ఆరోపణలు చేసింది. సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వం 2025 అసెంబ్లీ ఎన్నికల కోసం రూ.14,000 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధిని మళ్లించిందని జన్ సురాజ్ పార్టీ ఆరోపించింది.

Read Also: Bhagyashri Borse : భాగ్యశ్రీ ఖాతాలో మరో ప్లాప్.. కనికరం చూపని కాంత

ఎన్నిలక ఫలితాల తర్వాత జాతీయ అధ్యక్షుడు ఉదయ్ సింగ్ అన్నారు. జూన్ నుండి, ఎన్నికలు ప్రకటించే వరకు, నితీష్ కుమార్ ప్రభుత్వం ప్రజల డబ్బు ద్వారా ప్రజల ఓట్లను “కొనుగోలు” చేయడానికి రూ.40,000 కోట్లు ఖర్చు చేసిందని ఆయన ఆరోపించారు. ప్రపంచ బ్యాంకు నుంచి పొందిన రుణంలో రూ. 14,000 కోట్లను ఉచితాల కోసం వాడారని అన్నారు. రాష్ట్రంలోని మహిళల బ్యాంకు ఖాతాల్లోకి ఒక్కొక్కరికి రూ. 10,000 బదిలీ చేసిన ‘‘సీఎం మహిళా రోజ్ గార్ యోజన’’ పథకాన్ని దుయ్యబట్టారు. ఈ డబ్బులతో మహిళ ఓటర్లను ఆకట్టుకున్నారని అన్నారు. అధికాం కోసం బీజేపీ కూటమి అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు.

ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూల ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. 243 సీట్లు ఉన్న అసెంబ్లీలో ఏకంగా 202 స్థానాలు సాధించింది. ఇందులో బీజేపీ 89, జేడీయూ 85 , చిరాగ్ పాశ్వాన్ ఎల్జేపీ 19, ఇతర పార్టీలు మిగిలిన స్థానాలను దక్కించుకున్నాయి. ఆర్జేడీ, కాంగ్రెస్‌ల మహాఘట్బంధన్ కేవలం 35 సీట్లకు మాత్రమే పరిమితమైంది.