మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ అడ్వెంచర్ ‘విశ్వంభర’ చుట్టూ ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది, ప్రస్తుతానికి ఈ సినిమాపై అంచనాలు అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ, చిత్ర యూనిట్ మాత్రం ఒక భారీ ‘సైలెంట్ ప్లాన్’తో సిద్ధమవుతోంది. ప్రచారానికి దూరంగా ఉన్న ఫ్యాన్స్ను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసేందుకు దర్శకుడు వశిష్ట అండ్ టీమ్ గట్టిగానే స్కెచ్ వేశారు. సినిమాపై ఇప్పటివరకు పెద్దగా హైప్ లేదన్నది వాస్తవం. అయితే, ఒక్క ట్రైలర్ విడుదలయ్యిందంటే సీన్ మొత్తం మారిపోతుందని చిత్రబృందం నమ్ముతోంది. అందుకే ట్రైలర్ కట్ విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ షాట్స్ ఒక్కొక్కటిగా నిర్మాతల చేతికి అందుతుండగా, అందులో కొన్ని సీక్వెన్స్ అంచనాలకు మించి అద్భుతంగా వచ్చినట్లు సమాచారం. ఆ ‘బెస్ట్ షాట్స్’ను ఏరి కోరి ట్రైలర్లో పొందుపరుస్తున్నారు.
Also Read:PM Modi: అన్ని రాష్ట్రాల సీఎంలతో మోడీ కాన్ఫరెన్స్.. పశ్చిమాసియా పరిణామాలపై చర్చ
సినిమా గురించి మాట్లాడటం లేదని నీరసపడిపోతున్న అభిమానులకు, రాబోయే ట్రైలర్ ఒక గట్టి షాక్ ఇవ్వబోతోందట. ఆ విజువల్స్ చూశాక సోషల్ మీడియాలో ‘విశ్వంభర’ మేనియా మొదలవ్వడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. సినిమా రేంజ్ ఏంటో ఆ ట్రైలర్తోనే నిరూపించాలని మేకర్స్ పట్టుదలతో ఉన్నారు. నిజానికి శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా నుండి ఒక సాలిడ్ అప్డేట్ ఇవ్వాలని మేకర్స్ భావించారు. కానీ, అదే సమయంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా ‘పెద్ది’ గ్లింప్స్ విడుదల కావడంతో, ఒకే ఇంట్లో రెండు అప్డేట్స్ ఎందుకులే అన్న ఉద్దేశంతో ‘విశ్వంభర’ టీమ్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. సరైన సమయం చూసి ఒక్కసారిగా విజువల్ ట్రీట్ ఇచ్చేందుకు వారు సిద్ధమవుతున్నారు.