Ashwin Babu: శ్రీ శైలేంద్ర సినిమాస్ పతాకంపై అశ్విన్ బాబు, పాలక్ లాల్వాని జంటగా రూపుదిద్దుకుంటున్న సినిమా ‘వచ్చినవాడు గౌతమ్’. ఎం.ఆర్. కృష్ణను దర్శకుడిగా పరిచయం చేస్తూ, డి.ఎస్.ఆర్. ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు శుక్రవారం హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన నిర్మాత దామోదర ప్రసాద్ హీరో, హీరోయిన్ లపై చిత్రీకరించిన తొలి ముహూర్తము సన్నివేశానికి క్లాప్ కొట్టగా, నిర్మాత బెల్లంకొండ సురేష్ కెమెరా స్విచ్చాన్ చేశారు. నిర్మాత అనిల్ సుంకర గౌరవ దర్శకత్వం వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో నిర్మాత బెక్కం వేణుగోపాల్, దర్శకులు ఏ. యస్. రవి కుమార్, వి. సముద్ర, నటుడు రాజా రవీంద్రలతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
పూజా కార్యక్రమాల అనంతరం నటుడు, చిత్ర నిర్మాత డి. యస్. రావ్ మాట్లాడుతూ, ”కరోనా తర్వాత అనేకమంది నిర్మాతలు సినిమాలు తీసి చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే నేను కొద్ది రోజులు బ్రేక్ తీసుకొని సినిమా తీస్తున్నాను. దర్శకుడు యం ఆర్. కృష్ణ చెప్పిన మెడికో త్రిల్లర్ కథ… హీరో అశ్విన్ బాబుకు, నాకు నచ్చడంతో ఈ సినిమా చేస్తున్నాను. సురేష్ బాబు, కంటెంట్ బాగుంటేనే సినిమాలు ఆడతాయని చెప్పడంతో, ఈ కథను వారికి వినిపించి, బ్లెస్సింగ్స్ తీసుకుని మూవీని స్టార్ట్ చేస్తున్నాను. దర్శకుడు హీరో అశ్విన్ బాబును కొత్త కోణంలో చూపించ బోతున్నారు. పెద్ద పెద్ద సినిమాలు చేసిన టెక్నిషియన్స్ ఈ సినిమాకు పని చేస్తున్నారు. మంచి కంటెంట్ తో వస్తున్న ఈ చిత్రానికి ‘వచ్చిన వాడు గౌతమ్’ అనే టైటిల్ పెట్టడం జరిగింది. జనవరి నుండి రెగ్యులర్ షూట్ మెదలు పెట్టి వైజాగ్, హైదరాబాద్ లలో రెండు షెడ్యూల్స్ లో కంప్లీట్ చేస్తాం. ఇందులో నాజర్, ‘కాంతార’ ఫేమ్ అచ్యుత్ కుమార్, ఆర్జే హేమంత్, సంధ్యా జనక్, మాధవి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక నుండి మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలు తియ్యడానికి రెడీ అయ్యాను. త్వరలో ఒక యంగ్ హీరోతో కూడా సినిమా చేయబోతున్నాను” అని అన్నారు.