మన స్టార్ హీరోయిన్స్ సినిమాల్లోనే కాదు ఓటీటీలలోనూ దుమ్ము రేపటానికి సిద్ధం అయ్యారు. పలువురు తారలు డిజిటల్ ఎంట్రీ ఇచ్చేశారు. వారిలో కొందరు సక్సెస్ అయితే మరి కొందరు ఫెయిల్ అయ్యారు. ఇంకొందరు రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. మన దక్షిణాది తారలను తీసుకుంటే సమంత, కాజల్, తమన్నా, శ్రుతిహాసన్, నిత్యామీనన్, ప్రియమణి, అమలాపాల్, పాయల్, ఇషా రెబ్బ, అషిమా వంటి తారలు వెబ్ ఎంట్రీ ఇచ్చారు.
కాజల్ ‘లైవ్ టెలికాస్ట్’ అనే వెబ్ సీరీస్ లో నటించింది. హారర్ నేపథ్యంగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సీరీస్ హాట్ స్టార్ లో టెలీకాస్ట్ అయింది. అయితే ఈ ప్రయత్నంలో అమ్మడు ఆడియన్స్ ను ఆకట్టుకోలేక పోయింది. అలాగే నిత్యామీనన్ కూడా ‘బ్రీత్’ అనే సీరీస్ వచ్చి అభిషేక్ తో కలసి ఆమెజాన్ ప్రైమ్ లో సందడి చేసింది. అయితే ఈ సీరీస్ కూడా అంతగా ఆకట్టుకోలేక పోవడం గమనార్హం. ఇక శ్రుతిహాసన్, ఇషారెబ్బా, అమలాపాల్ ‘పెట్టకథలు’ అనే వెబ్ అంధాలజీ లో నటించారు. దీనికి నాగ్ అశ్విన్, నందినిరెడ్డి, తరుణ్ భాస్కర్, సంకల్స్ రెడ్డి వంటి ప్రముఖులైన దర్శకులు దర్శకత్వం వహించినా ఎలాంటి ప్రయోజనం లేక పోయింది. నెటిజన్స్ ‘పిట్ట కథలు’ను తిరస్కరించారు. అలాగే ‘ఆర్ఎక్స్ 100’ భామ పాయల్ రాజ్ పుత్ ‘అనగనగా ఓ అతిథి’ అనే వెబ్ ఫిల్మ్ లో నటించింది. ఇది కూడా అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. ఇప్పుడు మరో సీరీస్ లో నటిస్తోంది. ఇక మిల్కీ బ్యూటీ తమన్నా ఇటీవల ఆహా కోసం ’11త్ అవర్’ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కార్పొరేట్ డ్రామా తమన్నాకు మంచి పేరు తెచ్చిపెట్టిందనే చెప్పాలి. తమన్నా నటించిన మరో వెబ్ సీరీస్ ‘నవంబర్ స్టోరీస్’ త్వరలో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. పెళ్ళి తర్వాత దూసుకు పోతున్న ప్రియమణి అందరికంటే ముందుగానే ఓటీటీ వరల్డ్ లో అడుగుపెట్టింది. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. త్వరలో ‘ది ఫ్యామిలీ మ్యాన్2’ తో కూడా రాబోతోంది. ఇక అక్కినేని కోడలు సమంత ‘ది ఫ్యామిలీ మ్యాన్-2’ వెబ్ సిరీస్ ద్వారా వెబ్ వరల్డ్ లో అడుగుపెడుతోంది. ఈ సిరీస్ ను రాజ్ నిడిమోరు – కృష్ణ డీకే రూపొందిస్తున్నారు. ఈ సీరీస్ లో సమంత టెర్రరిస్టు పాత్రలో కనిపించబోతోందట. ఫిబ్రవరిలో స్ర్టీమింగ్ కావాల్సిన ఈ సిరీస్ వాయిదా పడింది. త్వరలో అమెజాన్ ప్రైమ్ లో రాబోతోంది. సినిమాల్లో మూస పాత్రలకు పరిమితం అయిన మన హీరోయిన్స్ డిజిటల్ లో మాత్రం ప్రయోగాలకు సైతం వెనుకాడటం లేదు. సమంత కూడా అలాగే తొలి సారి డిజిటల్ ప్లాట్ ఫామ్ పై విలనీ ప్రదర్శించబోతోంది. మరి ఈ ప్రయత్నంలో ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చూడాలి.