తమిళ స్టార్ హీరో సూర్య.. తన నెక్ట్స్ ప్రాజెక్ట్ స్టార్ డైరెక్టర్ బాలాతో చేస్తున్న సంగతి తెలిసిందే. చాలా రోజుల తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ సెట్ అవడంతో.. ఈ సారి ఎలాంటి కథతో రాబోతున్నారు.. ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. రీసెంట్గా కన్యాకుమారిలో షూటింగ్ మొదలైన ఈ సినిమా కథ పై.. ఇప్పుడో ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమా సముద్రం నేపథ్యంలో రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా.. ఈ మూవీ సెకండ్ హాఫ్ మొత్తం సముద్రం నేపథ్యంలోనే నడుస్తుందని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇందులో సూర్య పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని.. సూర్య కోసం బాలా మంచి డెప్త్ ఉన్న కథ రాశాడని.. సూర్య కెరీర్ లోనే ఈ చిత్రం స్పెషల్ గా ఉండబోతుందని తెలుస్తోంది. దాంతో సూర్య, బాలా మరో ప్రయోగం చేస్తున్నారనే చెప్పొచ్చు. సూర్య కెరీర్లో 41వ సినిమాగా వస్తున్న ఈ చిత్రంపై.. ఇప్పటి నుంచే భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.
ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. ఇప్పటికే ఒక కథానాయికగా క్యూట్ బ్యూటీ కృతి శెట్టిని ఫైనల్ చేశారు. అలాగే మరో హీరోయిన్గా టాలెంటెడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్ను తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇకపోతే.. ‘ఆకాశం నీ హద్దురా’, ‘జై భీమ్’ వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న సూర్య.. రీసెంట్గా వచ్చిన ‘ఈటీ’ మూవీతో ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. దాంతో బాలా ప్రాజెక్ట్తో సాలిడ్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. ఇప్పటికే బాలాకి విలక్షణ దర్శకుడిగా పేరు ఉంది. దాంతో ఈ సినిమా కమర్షియల్ పరంగానే కాదు.. అవార్డుల పంట కూడా పండిస్తుందని అంటున్నారు. ఇక ఆ తరువాత సుధా కొంగరతో ఓ సినిమా చేయబోతున్నారు సూర్య. అలాగే మరో టాలెంటెడ్ డైరెక్టర్ వెట్రిమారన్తో కూడా ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. ఇలా భారీ లైనప్తో వైవిధ్యంగా.. ఫుల్ బిజీగా ఉన్నాడు సూర్య. మరి సముద్రపు బ్యాక్ డ్రాప్లో వస్తున్న బాలా-సూర్య సినిమా ఎలా ఉంటుందో చూడాలి.