Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!

Irumudi

Irumudi

మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విజయోత్సవ వేడుక (సక్సెస్ మీట్) లో ఓ టాలీవుడ్ జర్నలిస్ట్ అడిగిన ఆసక్తికరమైన ప్రశ్నకు డైరెక్టర్ శివ నిర్వాణ ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ అండగా ఉన్నప్పుడు, అయ్యప్ప స్వామి మాలల నేపథ్యాన్ని ఒక భారీ సినిమాటిక్ సెలబ్రేషన్ లాగా చూపించే అవకాశం ఉన్నా.. దర్శకుడు ఆ సాహసం ఎందుకు చేయలేదు? కేవలం పది పన్నెండు మంది క్యారెక్టర్లతో, అదీ ఒక అడవిలో సినిమాను ఎందుకు తీయాల్సి వచ్చింది? అన్న దానికి శివ నిర్వాణ క్లారిటీ ఇచ్చారు.

హీరో త్రినాథ్ (రవితేజ) పాత్ర చాలా అమాయకమైనది. చూసే ప్రతి మనిషిని మంచోడు అనుకునే రకం. బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో అతనికి తెలియదు. అందుకే అతని ప్రపంచం ఒక ఏజెన్సీ, చిన్న ఊరు, గురుస్వామి లాంటి కొద్ది మంది వ్యక్తులకే పరిమితం చేయాల్సి వచ్చింది. ఈ కథలో ఒక క్రైమ్ లేయర్ ఉంది. దానికి ఒక ‘ఏరీ’ (భయంకరమైన/ఉత్కంఠభరితమైన) ఫీలింగ్ కావాలి. దట్టమైన అడవులు, డ్యామ్స్ మాత్రమే ఆ టెన్షన్‌ను, భయాన్ని క్రియేట్ చేయగలవు. రాజమండ్రి లాంటి గోదావరి జిల్లాల్లో అయ్యప్ప మాలల సెలబ్రేషన్‌ను చూపిస్తే అది ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమాటిక్ టచ్ లాగా అనిపిస్తుంది. అలా కాకుండా, పొల్లూరు అనే ఓ మారుమూల ప్రాంతంలో 20 మంది మాలేసుకునే ఒక చిన్న గుంపుకు మాత్రమే పరిమితం చేస్తే.. ప్రేక్షకుడి ఫోకస్ ఆ మనుషుల ప్రపంచంలో ఏం జరిగింది? అనే అంశం పైనే బలంగా ఉంటుంది. అందుకే అనవసరమైన హంగులకు పోకుండా, కథకు ఎంతవరకు అవసరమో ఆ పరిధిలోనే ఒక టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేసి ప్రేక్షకులను కుర్చీ అంచున కూర్చోబెట్టడంలో శివ నిర్వాణ వంద శాతం సక్సెస్ అయ్యారని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.