‘జీరో’ మూవీ ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కొద్ది రోజులు నటనకు దూరంగా ఉన్నాడు. అయితే ఇప్పుడు యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో కింగ్ ఖాన్ ‘పఠాన్’ మూవీ చేస్తున్నాడు. దీనితో పాటు షారుఖ్ ఖాన్.. ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ మూవీకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ సినిమా షూటింగ్ ఈ యేడాది మార్చిలో ముంబైలో మొదలవుతుందని తెలుస్తోంది. ఈ సినిమా కోసం ముంబై ఫిల్మ్ సిటీ స్టూడియోలో ఓ భారీ పంజాబ్ విలేజ్ సెట్ ను త్వరలో నిర్మించబోతున్నారని సమాచారం. మూవీ అత్యధిక భాగం చిత్రీకరణ ఈ విలేజ్ సెట్ లో జరుగుతుందని, ఆ తర్వాత లండన్, బుడాపెస్ట్ లో కొంత షూటింగ్ చేస్తారని అంటున్నారు.
Read Also : తలైవా కంటే ఎక్కువ ఫాలోయింగ్… సౌత్ లో అత్యధికంగా ఫాలో అవుతున్న స్టార్
షారుఖ్ ఖాన్ ‘జీరో’లో కత్రినా కైఫ్, అనుష్క శర్మ నటించారు. ఇక ‘పఠాన్’లో దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తుంటే, జాన్ అబ్రహం కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలానే మార్చిలో మొదలు కాబోతున్న రాజ్ కుమార్ హిరానీ మూవీలో అన్నీ అనుకూలిస్తే… తాప్సీ నాయికగా నటించే అవకాశం ఉందని అంటున్నారు. ఇటీవల ఈ విషయాన్ని తాప్సీని అడిగితే, చర్చలు జరుగుతున్నాయని, ఒకసారి ఫైనలైజ్ అయితే తానే అధికారికంగా ప్రకటిస్తానని చెప్పింది. అయితే… ఇప్పటి వరకూ ఇటు షారుక్, అటు రాజ్ కుమార్ హిరానీ మనసులో తాప్సీనే ఉందని తెలుస్తోంది. సో… కింగ్ ఖాన్ కు తాప్సీ లక్కీఛార్మ్ గా మారుతుందేమో చూడాలి!