తెలుగు ప్రేక్షకులతో పాటు దేశంమొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఆర్ఆర్ఆర్ మూవీ ఈ నెల 25వ తేదీన విడుదల కానుంది.. ఇక, ఏపీలో ఇప్పటి వరకు టికెట్ల వివాదం కొనసాగగా.. తాజాగా ప్రభుత్వం ఆ వివాదానికి తెరదింపుతూ.. జీవో విడుదల చేసింది.. అందులో కొన్ని షరతులు కూడా పెట్టింది.. ఇప్పటికే చిరంజీవి సహా టాలీవుడ్ ప్రముఖులతో కలిసి సీఎం వైఎస్ జగన్ను కలిసిన దర్శకుడు రాజమౌళి.. ఇవాళ ఆర్ఆర్ఆర్ మూవీ నిర్వాత డీవీవీ దానయ్యతో కలిసి.. సీఎం వైఎస్ జగన్తో సమావేశం అయ్యారు.. మూవీ విడుదల సమయంలో జరిగిన ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. అయితే, ఆ సమావేశానికి మంత్రి పేర్నినాని కూడా హాజరైనట్టు ప్రచారం జరిగింది.. దీనిపై స్పందించిన మంత్రి పేర్నినాని.. ఆ సమావేశంలో తాను లేనని క్లారిటీ ఇచ్చారు.
Read Also: RRR: ఉరకలెత్తించేలా… “ఎత్తర జెండా…”!
టికెట్ రేట్ల అంశం పై జీవో వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞత చెబుతామని తెలిపారన్న మంత్రి పేర్నినాని.. ఆ మేరకు సీఎం జగన్ సమయం ఇవ్వటంతో ఇవాళ వచ్చి కలిశారని.. అంతకు మించి వేరే ప్రాధాన్యత లేదని స్పష్టం చేశారు.. ఇక, జీవో ప్రకారం ప్రత్యేక రేట్లు, ఐదో షో నిబంధనల ప్రకారం అందరికీ వర్తించనట్లే వర్తిస్తాయని పేర్కొన్న ఆయన.. వాటిని ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు అని వెల్లడించారు. కాగా, వంద కోట్లకు పైగా పెట్టుబడి పెట్టిన సినిమాలకు రెండు వారాలు టికెట్ ధరలను పెంచుకొనేందుకు ప్రభుత్వం అనుమతిని ఇచ్చిన విషయం తెలిసిందే కాగా.. ఈ జీవోలోని కొన్ని సాంకేతిక అంశాలను రాజమౌళి, నిర్మాత దానయ్యలు.. సీఎం జగన్తో చర్చించినట్టుగా తెలుస్తోంది.