(మార్చి 14న స్వరబ్రహ్మ కేవీ మహదేవన్ జయంతి)
‘మామ’గా మన తెలుగువారి మదిలో చెరిగిపోని ముద్ర వేశారు స్వరబ్రహ్మ కేవీ మహదేవన్. ఆయన బాణీలు ఈ నాటికీ జనాన్ని చిందులు వేయిస్తూనే ఉన్నాయి. మహదేవన్ మన తెలుగువారు కాదు. అయితేనేం? ఆయన బాణీలతో తెలుగుజనం ఆనందసాగరంలో మునకలేశారు. ఈ నాటికీ ఆ మధురం మనల్ని వెంటాడుతూనే ఉంది.
తెలుగువారికి మహదేవన్ ‘మామ’గా మారడానికి కారణం – ఆదుర్తి సుబ్బారావు రూపొందించిన ‘మంచి మనసులు’ చిత్రంలోని పాటనే. దాదాపు ఏడుపదుల కాలం కిందట రూపొందిన ఆ పాట ఈ నాటికీ తెలుగువారి నోట నాట్యం చేస్తూనే ఉంది. 1962లో తెరకెక్కిన ‘మంచిమనసులు’ చిత్రంలో కొసరాజు రాసిన ‘మామ మామామామా…” పాట ఆ రోజుల్లో జనాన్ని ఉర్రూతలూగించింది. ఆ పాట గుర్తుకు వస్తే చాలు, మహదేవన్ తలపుల్లోకి రావలసిందే. ఆయన సంగీతమూ గుర్తొచ్చి పులకించి పోవలసిందే. తమిళనాట పుట్టినా, తమిళ చిత్రాలలో స్వరవిన్యాసాలు చేసి అలరించినా, ఎందుకనో మహదేవన్ కు తెలుగు చిత్రాలతోనే ఎక్కువబంధం ఉందని చెప్పక తప్పదు. కేవలం సాంఘిక చిత్రాలలోనే కాదు పౌరాణిక, జానపద, చారిత్రకాల్లోనూ మహదేవన్ బాణీలు భలేగా సాగాయి.
సందర్భోచితంగా స్వరకల్పన చేయడంలో దిట్ట మహదేవన్. అందుకనే పలువురు దర్శకులు, నిర్మాతలు మహదేవన్ బాణీలతోనే సాగాలని తలపించేవారు. దర్శకులేనా నిర్మాతల్లోనూ ఎందరో మహదేవన్ స్వరకల్పనతోనే విజయాలను చవిచూశారు. కొందరు నిర్మాతలయితే మహదేవన్ లేకుంటే సినిమాలే నిర్మించమనీ భీష్మించుకున్నారు. ఆయన మరణం తరువాత చిత్ర నిర్మాణానికి దూరమైన వారూ లేకపోలేదు.
మహానటులు యన్టీఆర్, ఏయన్నార్ ఇద్దరికీ మరపురాని విజయాలుగా నిలచిన చిత్రాలకు సైతం కేవీ మహదేవన్ సంగీతం సమకూర్చి మురిపించారు. తరువాతి తరాల వారికీ మహదేవన్ బాణీలు విజయసోపానాలు చూపించాయి. పలువురు వర్ధమాన కథానాయకులు మామ స్వరకల్పన చేసిన చిత్రాలతోనే తమ ఉనికిని చాటుకున్నారు. తరువాత స్టార్స్ గా వెలుగులు విరజిమ్మారు.
ఇంతకూ మహదేవన్ ప్రత్యేకత ఏమిటి అంటే, ఆయనకు తెలుగు అంతగా రాకపోయినా, తెలుగు పదాలను వింటే చాలు వాటికి ఇట్టే ట్యూన్స్ కట్టేస్తారు అని ప్రతీతి. ఆయనకు తగ్గ శిష్యునిగా పుహళేంది చివరిదాకా పయనం సాగించారు. తెలుగు గీతరచయితలు రాసిన పాటలను పుహళేంది వినేవారు. వాటిని ఆయన పాడి వినిపించగానే, వాటికి తగ్గ స్వరాలను మహదేవన్ సమకూర్చేవారు. తెలుగునాట పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘికాలన్నిటా మామ స్వరాలు భలేగా సందడి చేశాయి. ఇలా చెప్పుకుంటూ పోతే … ఎన్నెన్నో మామ మధురస్మృతులు మన మదిలో నాట్యం చేస్తాయి. మామ లేకున్నా, ఆయన పంచిన మధురామృతం మన సొంతం. మహదేవన్ ను తలచుకున్న ప్రతీసారి మరింత ఆనందంతో మైమరచిపోవలసిందే!