అలనాటి మహానటి సావిత్రి గూర్చి ఈ తరానికి గొప్పగా పరిచయం చేశారు దర్శకుడు నాగ్ అశ్విన్.. అయితే ఇప్పటి తరానికి సౌందర్య గూర్చి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సౌత్ సినిమా మొత్తంలో వందకు పైగా సినిమాల్లో నటించిన ఆమె విపరీతమైన అభిమానులను సంపాదించుకొంది. అభినవ సావిత్రి అనే బిరుదు సొంతం చేసుకున్న సౌందర్య.. హెలికాప్టర్ ప్రమాదంలో ఆకస్మిక మరణం చెందారు. అయితే ఆమె బయోపిక్ ను తెరకెక్కించాలనే ప్రయత్నాలు ఎప్పటినుంచో జరుగుతున్నాయి. కానీ, ఇప్పటికి ఎలాంటి సమాచారం లేదు. అయితే కన్నడ బ్యూటీ రష్మిక మందాన చేసిన కామెంట్స్ తో సౌందర్య బయోపిక్ మరోసారి చర్చకు వచ్చింది.
రష్మిక మందన అతి తక్కువ సమయంలోనే క్రేజీ హీరోయిన్ గా పేరుతెచ్చుకొని.. అభిమానులకు నేషనల్ క్రష్ గా మారింది. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోలతో పాటుగా, బాలీవుడ్ లోను వరుస అవకాశాలు అందుకుంటోంది. ఇదిలావుంటే, రష్మిక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఫ్యామిలీ నటిగా అభిమాన గుండెల్లో నిలిచిన సౌందర్య గూర్చి మాట్లాడుకొచ్చింది. ‘నేను సినిమాల్లోకి రాకముందు మా నాన్న, నన్ను సౌందర్యతో పోలి ఉంటానని అనేవారు. సౌందర్య నటన, సినిమాలు అంటే కూడా నాకు చాలా ఇష్టం.. అవకాశం వస్తే సౌందర్య బయోపిక్ లో నటిస్తానని.. అందుకోసం చాలానే వెయిట్ చేస్తున్నానని’ రష్మిక మనసులో మాట తెలిపింది. అయితే రష్మిక ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడంతో ఏ దర్శకుడైనా సౌందర్య బయోపిక్ తో వస్తాడేమో చూడాలి!