RajaBabu: కితకితలు పెట్టిన రాజబాబు హాస్యం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RajaBabu: నవరసాల్లో హాస్యాన్ని పండించడమే అసలైన పరీక్ష అంటారు నటీనటులు. కొందరు హాస్యాన్ని ‘కత్తి మీద సాము’తోనూ పోలుస్తారు. కామెడీలో కాసింత ఎక్కువైనా కారంగా, వికారంగా ఉంటుదనీ ప్రతీతి. అయితే, కొందరు అతి చేసినా, అతికినట్టుగానే అభినయించి ఆకట్టుకున్నవారు లేకపోలేదు. అలాంటి వారిలో నవ్వుల రేడు రాజబాబును ఎవరూ మరచిపోలేరు. ఆయన పండించిన హాస్యం ఈ నాటి ప్రేక్షకులకు సైతం కితకితలు పెడుతూనే ఉండడం విశేషం!
రాజబాబు అసలు పేరు పుణ్యమూర్తుల అప్పలరాజు. 1937 అక్టోబర్ 20న రాజబాబు జన్మించారు. ఆయనకు నలుగురు తమ్ముళ్ళు, ఐదుగురు అక్కాచెల్లెళ్ళు. రాజమండ్రిలో జన్మించిన రాజబాబు బాల్యం నుంచీ తన చేష్టలతో జనానికి వినోదం పంచేవారు. అప్పలరాజును అందరూ ముద్దుగా రాజాబాబు అంటూ పిలిచేవారు. తరువాతి రోజుల్లో నాటకాల్లో ఆ పేరుతోనే నటించారు రాజబాబు. ఇంటర్మీడియట్ కాగానే టీచర్ కోర్సు పూర్తిచేసి, కొంతకాలం ఉపాధ్యాయ వృత్తిలో రాణించారు. అప్పుడు కూడా నాటకాలు వేస్తూ ఆకట్టుకొనేవారు. రంగస్థలంపై ఆయన “నాలుగిళ్ళ చావిడి, కుక్కపిల్ల దొరికింది” వంటి నాటకాలతో పేరు సంపాదించారు.
Also Read
- Gayapadda Simham: ‘గాయపడ్డ సింహం’ ఓటీటీ రిలీజ్..
- Peddi: ‘పెద్ది’ నుండి స్పెషల్ సాంగ్ ప్రోమో రిలీజ్.. అదిరిపోయిన చరణ్ – శృతి స్టెప్స్
- Kangana Ranaut: మెడలో నల్లపూసలు.. చేతికి గాజులు..కంగనా రనౌత్ సీక్రెట్గా పెళ్లి చేసుకుందా..?
- Aadarsha Kutumbam AK47:వెంకీ – త్రివిక్రమ్ క్రేజీ ప్రాజెక్ట్లో..మరో బ్యూటీ ఎంట్రీ..!
జమున, అల్లు రామలింగయ్యను తన ‘పుట్టిల్లు’ చిత్రం ద్వారా పరిశ్రమకు పరిచయం చేసిన గరికపాటి రాజారావు ఓ సారి రాజబాబు నటించిన నాటకం చూడటం జరిగింది. రాజబాబులోని టైమింగ్ రాజారావును ఆకట్టుకుంది. దాంతో ఆయన రాజబాబును మద్రాసు రమ్మని చెప్పారు. అలా రాజబాబు మద్రాసులో అడుగుపెట్టారు. ఆరంభంలో ట్యూషన్స్ చెప్పుకుంటూ గడిపారు రాజబాబు. ఏ సినిమాలోనైనా బిట్ రోల్ ఇచ్చినా, నటించడానికి వెనుకాడేవారు కాదు. 1960లో అడ్డాల నారాయణరావు అనే దర్శకుడు తాను తెరకెక్కించిన ‘సమాజం’ చిత్రంలో రాజబాబుకు అవకాశం కల్పించారు. తరువాత యన్టీఆర్ ‘ఆత్మబంధువు’లో సూర్యకాంతం కొడుకుగా నటించి, ఆకట్టుకున్నారు రాజబాబు. ఆ పై కూడా ‘బందిపోటు, మంచి మనిషి’ వంటి చిత్రాల్లో బిట్ రోల్స్ లో కనిపించారు. అప్పట్లో పద్మనాభం, చలం వంటివారు కమెడియన్స్ గా రాజ్యమేలుతున్నారు.
వారి మధ్య రాజబాబు రాణించడం కష్టం అని చాలామంది అనుకున్నారు. అయితే రాజబాబు వారికి భిన్నంగా తనకంటూ ఓ ప్రత్యేకమైన బాణీని ఏర్పరచుకొని నవ్వించడం మొదలెట్టారు. సి.పుల్లయ్య రూపొందించిన ‘పరమానందయ్య శిష్యుల కథ’లో పద్మనాభం, అల్లు రామలింగయ్య వంటి మేటి నటులతో కలసి రాజబాబు తనదైన పంథాలో పకపకలు పంచారు. ఆ సినిమాతోనే రాజబాబుకు మంచి గుర్తింపు లభించింది. ఆ తరువాత యన్టీఆర్ తన సొంత చిత్రం ‘ఉమ్మడి కుటుంబం’లో వాణిశ్రీకి జోడీగా నటింప చేశారు. ఆ సినిమాలోని ‘సతీసావిత్రి’ నాటకంలో యన్టీఆర్ యమునిగా, వాణిశ్రీ సావిత్రిగా నటిస్తే, సత్యవంతునిగా రాజబాబు కనిపించారు. అందులో “సదివినోడికన్నా ఓరన్నా… మడేలన్న మిన్నా…” పాటలో రాజబాబు, వాణిశ్రీ జోడీ అలరించింది. అప్పటి నుంచీ రాజబాబుపై స్పెషల్ సాంగ్స్ కు జోరు పెరిగింది.
ఆ నాటి మేటి హీరోలందరి చిత్రాలలోనూ రాజబాబు హాస్యం తప్పనిసరిగా ఉండేది. శోభన్ బాబు, రాజబాబు మధ్య అనుబంధం బాగుండేది. ఒకరినొకరు ‘బావా’ అంటూ పిలుచుకొనేవారు. కృష్ణ హీరోగా రూపొందిన ‘ఇల్లు -ఇల్లాలు’లో పాటలన్నీ మురిపించినా, రాజబాబు, రమాప్రభపై చిత్రీకరించిన “వినరా సూరమ్మ కూతురు మొగుడా…” పాట అప్పట్లో విశేషాదరణ చూరగొంది. తెరపై రాజబాబు, రమాప్రభ జోడీ అనేక చిత్రాలలో ఎంతగానో నవ్వులు పూయించింది. దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం ‘తాత-మనవడు’లో తాతగా ఎస్వీ రంగారావు, మనవడుగా రాజబాబు నటించారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. తరువాత దాసరి దర్శకత్వంలోనే రాజబాబు హీరోగా “తిరపతి, ఎవరికి వారే యమునా తీరే” వంటి చిత్రాలు రూపొందాయి. ‘పిచ్చోడి పెళ్ళి, మనిషి రోడ్డున పడ్డాడు’ వంటి చిత్రాల్లోనూ రాజబాబు హీరోగా నటించారు. ‘బాబ్ అండ్ బాబ్ క్రియేషన్స్’ పతాకంపై రాజబాబు చిత్రాలు నిర్మించారు. ఈ పతాకంపై రూపొందిన చిత్రాలలో ‘ఎవరికి వారే యమునా తీరే’ మంచి విజయం సాధించగా, ‘మనిషి రోడ్డున పడ్డాడు’ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ‘రాధమ్మ పెళ్ళి’ చిత్రంలో రాజబాబు, రమాప్రభ స్వయంగా “కాకినాడ రేవు కాడా ఓడెక్కి…” సాంగ్ పాడటం విశేషం. అంతే కాకుండా, కొన్ని పాటల్లో రాజబాబు స్వయంగా గళం వినిపించినవీ ఉన్నాయి.
అప్పట్లో హాస్యనటులకు నంది అవార్డులు లేవు. అయితే రాజబాబు హాస్యాభినయాన్ని గౌరవిస్తూ అనేక సాంస్కృతిక సంస్థలు అవార్డులు ప్రదానం చేశాయి. మద్రాస్ ఆంధ్రా క్లబ్ రోలింగ్ షీల్డ్ ను వరుసగా ఐదు సంవత్సరాలు అందుకున్న ఘనత రాజబాబుదే. ఆయన, మహాకవి శ్రీశ్రీ తోడల్లుళ్ళు. శ్రీశ్రీ భార్య సరోజకు రాజబాబు అర్ధాంగి లక్ష్మీ అమ్ములు సోదరి. అలాగే గాయని రమోల కూడా రాజబాబు భార్యకు తోబుట్టువు. రాజబాబుకు ఇద్దరు కుమారులు నాగేంద్రబాబు, మహేశ్ బాబు. అమెరికాలో స్థిరపడ్డారు. రాజబాబు తమ్ముళ్ళలో చిట్టిబాబు, అనంత్ ఇద్దరూ హాస్యనటులుగా రాణించారు. ఆ రోజుల్లోనే స్టార్ కమెడియన్ గా సాగిన రాజబాబు సొంతవూరు రాజమండ్రిలో పారిశుద్ధ్య కార్మికులకు దానవాయి పేటలో భూమి ఇచ్చారు. అలాగే పలు విద్యాసంస్థలకు విరాళాలు అందించారు. కోరుకొండలో తన పేరిట ఓ జూనియర్ కళాశాల కూడా నిర్మించారు. తన చుట్టూ ఉన్నవారిని సదా నవ్విస్తూ కవ్విస్తూ సాగిన రాజబాబు, 1983 ఫిబ్రవరి 14న హైదరాబాద్ లో కన్నుమూశారు. ఆయన స్థానం ఈ నాటికీ భర్తీ కాలేదు. రాజబాబు హాస్యం మాత్రం తెలుగువారి మదిలో నిలిచే ఉంది.
తాజావార్తలు
-
Gayapadda Simham: ‘గాయపడ్డ సింహం’ ఓటీటీ రిలీజ్..
-
Honda City facelift: భారత మార్కెట్లోకి సరికొత్త హోండా సిటీ ఫేస్లిఫ్ట్.. అదిరిపోయే లుక్స్, ఫీచర్లు!
-
Kodak QLED Smart TV: కోడాక్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ రిలీజ్.. Google TV 5.0తో థియేటర్ ఫీల్!
-
Peddi: ‘పెద్ది’ నుండి స్పెషల్ సాంగ్ ప్రోమో రిలీజ్.. అదిరిపోయిన చరణ్ – శృతి స్టెప్స్
-
Kangana Ranaut: మెడలో నల్లపూసలు.. చేతికి గాజులు..కంగనా రనౌత్ సీక్రెట్గా పెళ్లి చేసుకుందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!