ప్రభాస్ తాజా చిత్రం ‘రాధేశ్యామ్’ సంక్రాంతి విడుదలకు సన్నాహాలు జరుపుకుంటోంది. ఈ సినిమా టీజర్ అభిమానులలో భారీ అంచనాలకు తెరలేపింది. ఇందులో ప్రభాస్ పాతకాలపు ప్రసిద్ధ పామిస్ట్గా పరిచయం అయ్యాడు. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వాస్తవానికి నిజజీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్లు సమాచారం. అయితే దానికి పూర్తిగా కమర్షియల్ హంగులు జోడించి తీసినట్లు వినికిడి. 20వ శతాబ్దానికి చెందిన ప్రముఖ ఐరిష్ హస్తసాముద్రికకారుడు చెయిరో జీవితం స్ఫూర్తితో దీనిని తీశారట. చెయిరోగా ప్రఖ్యాతి గాంచిన విలియం జాన్ వార్నర్ తన హస్తసాముద్రికం, సంఖ్యాశాస్త్రంతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఐరిష్ జ్యోతిష్కుడు.
Read Also : మరో మైలు రాయిని దాటిన “సర్కారు వారి పాట” బ్లాస్టర్
రాజుల మరణాలతో పాటు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సంఘటనలు అంచనా వేయటంలో ఇతగాడు ఎంతో ప్రసిద్ది చెందాడు. 1880లో భారతదేశంలో జ్యోతిషశాస్త్ర నైపుణ్యాన్ని నేర్చుకున్న చెయిరో జీవితంతో ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయంగా పలు సినిమాలు తెరకెక్కాయి. ఇప్పుడు ‘రాధేశ్యామ్’లో ఈ ప్రసిద్ధ పామిస్ట్ కథలో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నారట. ఇప్పటికే ఫస్ట్ లుక్స్, టీజర్ తో ఆకట్టుకున్న ‘రాధేశ్యామ్’ సినిమాగానూ అలరిస్తుందని భావిస్తున్నారు. ఇందులో పూజా హేగ్డే కథానాయిక కాగా యువి క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.