పైరసీని అరికట్టడంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసులకు మీడియా సమక్షంలో తెలుగు చిత్ర పరిశ్రమ ధన్యవాదాలు తెలిపింది. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి హైదరాబాద్లో రెండు రోజుల క్రితం అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. విదేశాల నుంచి రవి హైదరాబాద్ రాగా.. తెలంగాణ పోలీసులు అతడిని పక్కా ప్రణాళికతో పట్టుకున్నారు. రవి అరెస్ట్ నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రెస్మీట్ నిర్వహించింది. ఈ ప్రెస్మీట్లో టాలీవుడ్ సీనియర్ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘సినిమా పైరసీ అనేది క్యూబ్, వీఎఫ్స్ లాంటి ప్లాట్ఫామ్స్ నుంచి బయటకు వెళ్తుంది. నిర్మాతలు వాటి మీద కచ్చితంగా దృష్టి పెట్టాలి. ఎక్కువ బడ్జెట్ పెట్టి సినిమా తీసామని టికెట్ రేటు పెంచితే ఎలా?. టికెట్ రేటు ఎక్కువ ఉండడం వల్లనే ప్రేక్షకులు దొంగ దారిలో సినిమా చూస్తున్నారు. క్వాలిటీ సినిమా తీయాలి కానీ.. బడ్జెట్ ఎక్కువ సినిమాలు కాదు. భారీ బడ్జెట్ సినిమాల్లో రెమ్యునరేషన్ ఒకరికి ఇద్దరికీ మాత్రమే ఎక్కువ ఇస్తున్నారు. దాని ప్రభావం వల్ల టికెట్ రేటు ఎక్కువ అవుతుంది. పెద్ద బడ్జెట్ సినిమాలు సంవత్సరానికి 10 లోపు వస్తుంటాయి. వాటి వల్ల చిన్న సినిమాలు ఎక్కువ నష్టపోతున్నాయి’ అని నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు చెప్పారు.
Also Read: Kalyan C: ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలి.. నిర్మాత సి కళ్యాణ్ ఫైర్!
వల్లభనేని అనిల్ కుమార్ మాట్లాడుతూ… ‘సినిమాలు ప్రస్తుతం విజయం సాధించలేకపోవడానికి ముఖ్య కారణం పైరసీ. టెక్నాలజీ మారుతూ వచ్చిన ప్రతిసారి పైరసీ కూడా రూపం మార్చుకుంటూ వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం పైరసీని అరికట్టడం బిగ్ చాలెంజ్గా తీసుకుంది. పైరసీ చేసే వారిని పట్టుకోవడం జరిగింది. అది సినీ పరిశ్రమకు వరం. టికెట్ ధరలు కూడా కుటుంబంతో సహా వచ్చే విధంగా ఉండేలా చూడాలి. పైరసీని పూర్తిగా అరికడితేనే కొత్త నిర్మాతలు ధైర్యంగా ముందుకు వచ్చి సినిమాలు చేస్తారు’ అన్నారు.