తెలుగు చిత్రసీమలో సి.కళ్యాణ్ అందరికీ తలలో నాలుకలా ఉంటారు. అందరివాడు అనిపించుకుంటారు. అందరితోనూ కలసి పోతుంటారు. సినిమా రంగంలో ఏ సమస్య వచ్చినా, అందుకు తగ్గ పరిష్కారం కోసం సినీపెద్దలతో చర్చించడంలోనూ, ప్రభుత్వాలతో మంతనాలు జరపడంలోనూ ముందుంటారు. ఒకప్పుడు చిన్న సినిమాల నిర్మాతగా పయనం మొదలుపెట్టి, నేడు అగ్రకథానాయకులతోనూ చిత్రాలు నిర్మించే స్థాయికి చేరుకున్నారు సి.కళ్యాణ్. తెలుగు సినిమా రంగంలో పలు శాఖల్లో అధ్యక్షునిగా పనిచేసిన సి.కళ్యాణ్, ఒకప్పుడు ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ ప్రెసిడెంట్ గానూ సేవలు అందించారు.
నెల్లూరు జిల్లాలో సి.కళ్యాణ్ జన్మించారు. చిత్రసీమపై మనసు పారేసుకొని, మదరాసు చేరారు. అక్కడ దొరికిన అవకాశాన్నల్లా ఉపయోగించుకుంటూ ముందుకు సాగారు. కొన్ని చిన్న చిత్రాల నిర్మాణంలో పాలు పంచుకున్నారు. ‘శ్రీఅమూల్య ఆర్ట్ ప్రొడక్షన్స్’ పతాకంపై సి.కళ్యాణ్ సమర్ఫణలో “వద్దు బావా తప్పు, లేడీస్ డాక్టర్” వంటి చిత్రాలు రూపొందాయి. తాను చిన్న నిర్మాత అయినా, ఇతర నిర్మాతలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చేతనైన సాయం చేసి ఆదుకొనేవారు. అందువల్లే సి.కళ్యాణ్ అందరివాడు అనిపించుకున్నారు.
శ్రీహరి హీరోగా సి.కళ్యాణ్ నిర్మించిన ‘బలరామ్’ మంచి విజయం సాధించింది. ఆయన సోదరుడు సి.వెంకటేశ్వరరావు నిర్మాతగా, సి. కళ్యాణ్ సమర్పకుడిగా చిత్రాలు నిర్మించేవారు. కృష్ణవంశీ దర్శకత్వంలో సి.కళ్యాణ్ నిర్మించిన ‘చందమామ’ మంచి విజయం సాధించి, కళ్యాణ్ కు తొలి విజయాన్ని అందించింది. ఆ తరువాత తమ సొంత బ్యానర్ సి.కె.ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపైనా, ఇతర నిర్మాతలతోనూ కలసి చిత్రనిర్మాణం సాగించారు. మహేశ్ బాబుతో ‘ఖలేజా’, నితిన్ తో ‘ఆటాడిస్తా’, నానితో ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’, వరుణ్ తేజ్ తో ‘లోఫర్’, సాయిధరమ్ తో ‘ఇంటెలిజెంట్’, ఛార్మితో ‘జ్యోతిలక్ష్మి’ , రాజశేఖర్ తో ‘కల్కి’ వంటి చిత్రాలతో పాటు కొన్ని అనువాద చిత్రాలనూ అందించారు సి.కళ్యాణ్. బాలకృష్ణ హీరోగా దాసరి నారాయణ రావు దర్శకత్వంలో ‘పరమవీరచక్ర’ నిర్మించారు. తరువాత బాలకృష్ణతో ‘జైసింహా, రూలర్’ వంటి చిత్రాలనూ తెరకెక్కించారు. అప్పట్లో విజయం సాధించిన ‘జై సింహా’ శతదినోత్సవాన్ని చిలకలూరి పేటలో ఘనంగానూ నిర్వహించారు.
సి.కళ్యాణ్ నిర్మాతల మండలి అధ్యక్షునిగా ఉన్నారు. ఛాంబర్ లోనూ అనేక శాఖల్లో కీలక పాత్రలు పోషించారు. సౌత్ ఇండియా ఫిలిమ్ ఛాంబర్ అధ్యక్షునిగా పనిచేశారు. సి.కళ్యాణ్ పనితనం గమనించిన దక్షిణాది అన్ని చిత్రసీమల వారు ఆయనను ఆల్ ఇండియా ఫిలిమ్ కాన్ఫెడరేషన్ అధ్యక్షునిగానూ ఎన్నుకున్నారు. ఇలా అందరితోనూ సఖ్యంగా సాగుతున్న సి. కళ్యాణ్ ఇప్పటికీ చిత్ర నిర్మాణంలో బిజీగానే ఉన్నారు. ప్రస్తుతం సత్యదేవ్ హీరోగా ‘గాడ్సే’ అనే సినిమాను నిర్మిస్తున్నారాయన.
రానా హీరోగా ‘1945’ అనే సినిమాను నిర్మించారు. సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. బాలకృష్ణతో ‘రామానుజాచార్య’ చిత్రం నిర్మించాలనే ప్రయత్నంలో ఉన్నారు కళ్యాణ్. ఏది ఏమైనా సి.కళ్యాణ్ తెలుగు చిత్రసీమలో తనకంటూ ఓ ప్రముఖ స్థానం సంపాదించుకున్నారు. మునుముందు ఆయన మరిన్ని మంచి చిత్రాలతో జనాన్ని అలరిస్తారని ఆశిద్దాం.