యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’ విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదని చిత్ర నిర్మాతలు బుధవారం మరోసారి స్పష్టం చేశారు. ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న ఈ సినిమాను ‘జిల్’ రాధాకృష్ణ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ తో కలసి, గోపీకృష్ణా మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. జస్టిన్ ప్రభాకర్ స్వరాలు సమకూర్చుతున్న ‘రాధేశ్యామ్’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా 12న పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’, 13న మహేశ్ బాబు ‘సర్కారు వారిపాట’ చిత్రాలు వస్తున్న నేపథ్యంలో ‘రాధేశ్యామ్’ను అదే జనవరి 14న విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే దర్శకనిర్మాతలు ప్రకటించారు. అయితే… తాజాగా ‘ట్రిపుల్ ఆర్’ మూవీ సైతం సంక్రాంతి సీజన్ కే వచ్చే ఆస్కారం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యం ఆ సీజన్ లో రావాల్సిన కొన్ని సినిమాలు వాయిదా పడొచ్చనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. దీనిని ఖండిస్తూ, ‘రాధేశ్యామ్’ విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదని, 2022 జనవరి 14నే తమ చిత్రాన్ని వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తామని మరోసారి నిర్మాతలు నొక్కి చెప్పారు.