మహమ్మారి వల్ల ప్రస్తుతం హీరోలందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. అయితే, పవన్ కళ్యాణ్ మరింత జాగ్రత్తగా ఉండాల్సి వస్తోంది. ఆయనకు కరోనా సోకటంతో ఇప్పుడు స్లోగా రికవర్ అవుతున్నారు. డాక్టర్స్ ఎంత విశ్రాంతి తీసుకుంటే అంత మంచిది అనటంతో పీకే పూర్తిగా తన ఫామ్ హౌజ్ కే పరిమితం అయ్యారు. కాకపోతే, మళ్లీ షూటింగ్స్ మొదలైతే ఆయన నటిస్తోన్న రెండు చిత్రాలు కూడా సెట్స్ మీదకి వెళతాయి. అంతలోగా పవన్ ఫిజికల్ గా ఫిట్ గా మారాల్సి ఉంది. ఎట్ లీస్ట్, జూలై ప్రారంభం అయ్యేలోపు ఆయన బరిలోకి దిగటానికి సిద్ధమైతే డైరెక్టర్ క్రిష్, సాగర్ చంద్ర మూవీలు రెండూ పట్టాలెక్కేస్తాయి…
మలయాళ మూవీ ‘అయ్యప్పనుమ్ కోశియమ్’ రీమేక్ లో కళ్యాణ్ నటిస్తోన్న సంగతి మనకు తెలిసిందే. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తోన్న ఆ సినిమా లాక్ డౌన్ వల్ల ఆగిపోయింది. ఇక క్రిష్ సారథ్యంలో వస్తోన్న ‘హరిహర వీరమల్లు’ కూడా ముందుకు సాగటం లేదు. పైగా అది చారిత్రక చిత్రం కావటంతో యుద్ధ సన్నివేశాలు, సాహసాలు ఎక్కువగానే ఉంటాయంటున్నారు. మరి ‘అయ్యప్పనుమ్ కోశియమ్’ రీమేక్, ‘హరిహర వీరమల్లు’ చిత్రాల్లో పవన్ మొదటగా ఏది స్టార్ట్ చేస్తాడు? ఆ సంగతి ఇప్పుడే చెప్పలేం. కానీ, క్రిష్ పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ గురించిన ఒక ఆసక్తికర ప్రచారం ఇండస్ట్రీలో జరుగుతోంది!
పవన్ కళ్యాణ్ త్రిపాత్రిభినయం చేయబోతున్నాడా? అవుననే అంటున్నారు కొందరు ఫిల్మ్ నగర్ జనం! క్రిష్ ఇప్పటికే మూడు పాత్రల్ని అద్బుతంగా తీర్చిదిద్దాడని చెబుతున్నారు. సినిమా విడుదలయ్యాక పీకే ఫ్యాన్స్ కి ఖచ్చితంగా విజువల్ ట్రీట్ లా ఉంటుందని వారంటున్నారు! ఈ ట్రిపుల్ రోల్ థ్రిల్ సంగతి నిజమో కాదో చెప్పలేం కానీ… ‘హరిహర వీరమల్లు’ జనసేనాని కెరీర్ కి ఎప్పటికీ ప్రత్యేకమైన సినిమాగా మాత్రం నిలిచిపోనుంది! అంత వరకూ గట్టిగా చెప్పొచ్చు!