On Pelli Choopulu release date, New Movie Shooting Starts!
‘పెళ్లి చూపులు’, ‘డియర్ కామ్రేడ్’, ‘దొరసాని’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన బిగ్ బెన్ సినిమాస్ సంస్థ తన 6వ చిత్రాన్ని శుక్రవారం లాంఛనంగా హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్ లో ప్రారంభించింది. యష్ రంగినేని నిర్మిస్తున్న ఈ చిత్రంలో చైతన్య రావ్, లావణ్య హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘ఓ పిట్ట కథ’ ఫేమ్ చెందు ముద్దు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత సురేష్ బాబు క్లాప్ నివ్వగా, దర్శకులు తరుణ్ భాస్కర్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మొదటి షాట్ కు వివేక్ ఆత్రేయ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో ‘మధుర’ శ్రీధర్ రెడ్డి, సందీప్ రాజ్, సాయి రాజేష్, మాటల రచయిత లక్ష్మీ భూపాల్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత యష్ రంగినేని మాట్లాడుతూ, ”మా మొదటి సినిమా ‘పెళ్లి చూపులు’ విడుదలైన తేదీ జూలై 29. అదే రోజున మా కొత్త చిత్రాన్ని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. మా సంస్థలో ఇది ఆరో సినిమా. గ్రామీణ నేపథ్యంతో సాగుతుంది. దాదాపు అంతా కొత్తవాళ్లే నటిస్తున్న ఈ సినిమాకు కథే స్టార్. చాలా ఫ్రెష్ గా ఉండే సబ్జెక్ట్ తో దర్శకుడు చెందు ముద్దు తెరకెక్కిస్తున్నారు. ఆగస్ట్ 1 నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తాం. అమలాపురం, అరకు ప్రాంతాల్లో దాదాపు నెల రోజులు షూటింగ్ చేస్తాం. ఆ తర్వాత సెప్టెంబర్ లో కేరళ షెడ్యూల్ ఉంటుంది. అక్టోబర్ కల్లా ఫస్ట్ కాపీ రెడీ చేసేందుకు ప్రయత్నిస్తాం” అని అన్నారు.
హీరో చైతన్య రావ్ మాట్లాడుతూ, ”ఈ సబ్జెక్ట్ విన్నాక నా కెరీర్ లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా అవుతుందనిపించింది. సక్సెస్ మీట్ లో మిమ్మల్ని తప్పకుండా కలుస్తాం అనే నమ్మకం కలిగింది” అని అన్నారు. హీరోయిన్ లావణ్య మాట్లాడుతూ, ”అన్ని కమర్షియల్ అంశాలు ఈ కథలో ఉన్నాయి. చెందు చేసిన ‘ఓ పిట్ట కథ’ నా ఫేవరేట్ మూవీ. ఈ కథతోనూ ఆయన ఓ మంచి సినిమా చేస్తారని నమ్మకం కలిగింది. ఇందులో నా క్యారెక్టర్ చాలా బాగుంటుంది” అని తెలిపింది. నటి ఉత్తర మాట్లాడుతూ, ”మా సినిమాకు మంచి స్క్రిప్ట్ కుదిరింది. ఈ చిత్రంలో నేనొక కీలక పాత్రలో నటిస్తున్నాను. మాలాంటి న్యూ టాలెంట్ కు అవకాశం ఇచ్చిన నిర్మాత యష్ గారికి థాంక్స్” అని చెప్పింది. దర్శకుడు చెందు ముద్దు మాట్లాడుతూ, ”కొత్త తరహాలో, ప్రయోగాత్మక పద్ధతిలో ఈ సినిమా మేకింగ్, లొకేషన్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నాం. ఒక హిట్ సినిమాను మా నిర్మాత యష్ గారికి ఇవ్వబోతున్నాం” అని అన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు ప్రిన్స్ హెన్రీ, సినిమాటోగ్రాఫర్ పంకజ్ తొట్టాడ, నటి మిహిరా తదితరులు పాల్గొన్నారు.