#Mentoo: నరేష్ అగస్త్య, బ్రహ్మాజీ, హర్ష చెముడు, సుదర్శన్, మౌర్య సిద్ధవరం, కౌశిక్ ఘంటశాల, రియా సుమన్, ప్రియాంక శర్మ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘#మెన్ టూ’. శ్రీకాంత్ జి. రెడ్డి దర్శకత్వంలో మౌర్య సిద్ధవరం ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ మే 26న రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో బ్రహ్మాజీ మాట్లాడుతూ “ఇండస్ట్రీలో నాకొక ట్రాక్ రికార్డ్ ఉంది. తెలుగులో టాప్ డైరెక్టర్స్ అందరి తొలి సినిమాలో నేను నటించాను. ఆ లెక్కలో ఈ సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ లక్కీ అనే చెప్పాలి. ఇదొక ఫన్నీ కాన్సెప్ట్. ఇప్పటి వరకు మగవాళ్లు దుర్మార్గులు అని చెప్పి అందరూ సినిమాలు తీశారు. నాకు తెలిసి ఆడవాళ్లు మగవాళ్లని ఎంత టార్చర్ పెడతారని ప్రపంచంలో ఇంత వరకు ఎవరూ సినిమా తీయలేదు. ఇదే ఫస్ట్ టైమ్. అసలు ఏ విధంగా టార్చర్ పెడతారనేది ఈ సినిమా చూసి తెలుసుకోవచ్చు. అలాగని ఇది వన్ సైడెడ్ మూవీ కాదు. ఇద్దరి వైపులా ఉండే సమస్యలను చూపిస్తున్నాం’’ అని అన్నారు. నరేష్ అగస్త్య మాట్లాడుతూ “ముందుగా మా సినిమా డిస్ట్రిబ్యూట్ చేస్తున్న మైత్రీ మూవీస్ కు థాంక్స్. వీరితో పాటు క్లాప్ ఎంటర్టైన్మెంట్ సపోర్ట్ చేయకపోతే మేం ఇక్కడ నిలిచేవాళ్లం కాదు. ‘మత్తు వదలరా’ మూవీ చూసి మౌర్య ఈ సినిమాకు నన్ను సెలక్ట్ చేసుకున్నాడు. తనకు థాంక్స్. శ్రీకాంత్, కార్తీక్, మౌర్య, ఎలిషా అందరికీ ఇది తొలి సినిమా. మేం చాలా నమ్మకంతో ఉన్నాం” అని చెప్పారు.
చిత్ర దర్శకుడు శ్రీకాంత్ జి.రెడ్డి మాట్లాడుతూ “‘# మెన్ టూ’ చిత్రంలో మేం ఎక్కడా ఆడవాళ్లని తిట్టలేదు. సినిమా ఇంత బాగా రావటానికి నిర్మాతలు, మౌర్యనే కారణం. అమ్మాయిలకు కూడా సినిమా నచ్చుతుంది. మే 26న సినిమా చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. మేమంతా ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నాం’’ అని అన్నారు. నిర్మాత మౌర్య సిద్ధవరం మాట్లాడుతూ “మా సినిమా ఇంత దూరం రావటానికి కారణం మైత్రీ మూవీస్ సంస్థ. సినిమా చాలా బాగా వచ్చింది. సక్సెస్ పై చాలా నమ్మకంతో ఉన్నాను. హిలేరియస్ ఎంటర్ టైనర్గా రూపొందిన ఈ సినిమాను అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు” అని అన్నారు. ఈ కార్యక్రమంలో కో-ప్రొడ్యూసర్ శ్రీమాన్, కౌశిక్, హీరోయిన్ ప్రియాంక వర్మ తదితరులు పాల్గొని సినిమా విజయంపై ధీమా వ్యక్తం చేశారు.