తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డులకు కేరాఫ్ అడ్రస్ అయిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు డిజిటల్ ప్రపంచాన్ని షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకు వెండితెరపై తన నటనతో, డ్యాన్సులతో కోట్లాది మంది అభిమానులను అలరించిన చిరు.. త్వరలోనే ఒక ప్రతిష్టాత్మక ‘పోడ్కాస్ట్’ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ టాక్ షో ద్వారా తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలోని అరుదైన అనుభవాలను, ఎవరికీ తెలియని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఆయన పంచుకోనున్నారు. నందమూరి బాలకృష్ణతో ‘అన్స్టాపబుల్’ టాక్ షోను దేశవ్యాప్తంగా నెంబర్ వన్ ట్రెండింగ్ సిరీస్గా నిలపడంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ రచయిత బి.వి.ఎస్. రవి ఈ ప్రాజెక్ట్కు వెన్నుముకగా నిలవబోతున్నారు.
తాజాగా ఎన్టీవీ (NTV Podcast) పోడ్కాస్ట్లో పాల్గొన్న రైటర్ బి.వి.ఎస్. రవి ఈ మెగా ప్రాజెక్ట్కు సంబంధించిన క్రేజీ డీటెయిల్స్ను లీక్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “చిరంజీవి అనే వ్యక్తి ఈ తెలుగు సినీ పరిశ్రమ అనే మహాసముద్రాన్ని అటు నుండి ఇటు, ఇటు నుండి అటు ఒక పదిసార్లు ఈదారు. సున్నా నుండి మొదలై ఆయన చేరుకున్న శిఖరాలు, ఆయన లైఫ్ జర్నీ వెనుక ఉన్న శ్రమను రాబోయే తరాలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఆయన జీవితంలో జరిగిన ప్రతీ ముఖ్యమైన అనుభవాన్ని కూలంకషంగా చర్చించేలా ఈ పోడ్కాస్ట్ను డిజైన్ చేస్తున్నాం” అని చెప్పుకొచ్చారు. గతంలో మెగాస్టార్ కుమార్తె సుష్మిత కొణిదెల కూడా ఒక ఇంటర్వ్యూలో ఈ ప్రాజెక్ట్ గురించి హింట్ ఇవ్వగా.. ఇప్పుడు బి.వి.ఎస్. రవి మరింత సమాచారంతో అధికారికంగా క్లారిటీ ఇచ్చేశారు. చిరంజీవితో కలిసి గత యాభై ఏళ్లలో పనిచేసిన ఇండస్ట్రీ దిగ్గజాలు, దర్శకులు, నిర్మాతలను ఈ షోకి తీసుకొచ్చి ముచ్చటిస్తారా? లేక చిరు నటించిన ఇండస్ట్రీ హిట్ సినిమాల వారీగా ఒక్కో ఎపిసోడ్ను ప్లాన్ చేస్తారా? అనే సస్పెన్స్ క్లియర్ కావాలంటే ఇంకా కొన్నాళ్ళు ఆగాల్సిందే!
