Matti Khusthi: హీరో విష్ణు విశాల్ హీరోగా చెల్లా అయ్యావు దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ, స్పోర్ట్స్ డ్రామా ‘మట్టి కుస్తీ. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను డిసెంబర్ 2న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ విశేషాలను ఆమె మీడియాతో పంచుకుంది. తొలుత ఈ సినిమాను అంగీకరించిన వివరాలు చెబుతూ, ”మూడేళ్ళ క్రితం కోవిడ్ కి ముందే ‘మట్టి కుస్తీ’ కథ విన్నాను. నాకు చాలా నచ్చింది. అయితే ఇందులో హీరోయిన్ పాత్ర చాలా సవాల్ తో కూడుకున్నది. ఆ పాత్రకు న్యాయం చేయలేనని అనిపించింది. ఇదే విషయం దర్శకుడికి చెప్పాను. తర్వాత కోవిడ్ వచ్చింది. మూడేళ్ళ తర్వాత స్క్రిప్ట్ మళ్ళీ నా దగ్గరికే వచ్చింది. ఈ గ్యాప్ లో కొన్ని సినిమాలు చేయడం వలన కాన్ఫిడెన్స్ వచ్చింది. దీంతో ‘మట్టి కుస్తీ’ ని చేయాలని నిర్ణయించుకున్నా” అని తెలిపింది.
ఇందులో ఐశ్వర్య లక్ష్మీ పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. దాని గురించి తెలుపుతూ, ”ఇందులో నేను పోషించిన పాత్ర చాలా ఫిజికల్ వర్క్ ని డిమాండ్ చేస్తుంది. దానికి చాలా కావాలి. ట్రైలర్ లో స్టంట్స్ చూసే వుంటారు. ఎమోషనల్ సీన్స్ ని చేయడం నాకు ఇష్టమే. కామెడీ అనేది నా వరకూ చాలా కష్టం. మొదటి సారి ఇందులో కామెడీని ప్రయత్నించాను. ఇదివరకు నేను చేసిన పాత్రల్లో కామెడీ లేదు. ‘మట్టి కుస్తీ’ నాకు ఓ సవాల్. ప్రేక్షకులు ఎలా తీసుకుంటారో తెలీదు కానీ దర్శకుడు నా ఫెర్ ఫార్మెన్స్ పట్ల చాలా ఆనందంగా వున్నారు. ప్రేక్షకులకు కూడా నచ్చుతుందనే నమ్మకం వుంది. మూవీ గురించి చెప్పాలంటే, ఇదో ఫ్యామిలీ డ్రామా. ఇది భార్యభర్తల కుస్తీ. ఇగో, వినోదం, కుస్తీ… అన్నీ ఎలిమెంట్స్ వుంటాయి. ప్రతి ఒక్కరూ ఈ కథకు కనెక్ట్ అవుతారు. ఇంత చక్కని ఫ్యామిలీ ఎమోషన్స్, వినోదం వున్న చిత్రం ఈ మధ్య కాలంలో రాలేదు. ఆడ, మగ సమానమే అనే సందేశాన్ని చాలా వినోదాత్మకంగా చూపించాం. పైసా వసూల్ మూవీ అని చెప్పొచ్చు” అని అన్నారు.
హీరో విష్ణు విశాల్, నిర్మాత రవితేజ గురించి చెబుతూ, ”విష్ణు విశాల్ స్ఫూర్తినిచ్చే వ్యక్తి. చాలా హార్డ్ వర్క్ చేస్తారు. ది బెస్ట్ కోసం ప్రయత్నిస్తుంటారు. ప్రమోషన్స్ మొదలుపెట్టినప్పటి నుండి ఆయన సరిగ్గా నిద్రకూడా పోలేదు. ఆయనకు కథల ఎంపికలో మంచి అభిరుచి వుంది. ఆయన లాంటి విజన్ చాలా తక్కువ మందిలో కనిపిస్తుంటుంది. ఆయన నుండి చాలా నేర్చుకున్నాను. నటుడిగా, నిర్మాతగా ఆయన ప్రయాణం అద్భుతం. ఆయనతో పని చేయడం చాలా ఆనందం గా వుంది. అలానే ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న తెలుగు స్టార్ రవితేజా గారు ఎప్పుడూ షూటింగ్ కు రాలేదు. విష్ణు విశాల్ ను పూర్తిగా నమ్మి, కావాల్సింది సమకూర్చారంతే. ఆయన ఫైనల్ అవుట్ పుట్ చూసి చాలా హ్యాపీ ఫీలయ్యారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే రవితేజా గారిని కలిశాను” అని చెప్పింది.
తెలుగు ఆడియెన్స్ గురించి ఐశ్వర్య లక్ష్మీ మాట్లాడుతూ, ”నాకు సాయిపల్లవి, సత్యదేవ్ తో చక్కని పరిచయం ఉంది. తెలుగు ప్రేక్షకులు సినిమాని గొప్పగా ప్రేమిస్తారు. అందుకే తెలుగు చిత్ర పరిశ్రమ ఇండియాలోనే బిగ్గెస్ట్ ఇండస్ట్రీ గా ఎదిగింది. టాలీవుడ్, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని రూల్ చేస్తోంది. తెలుగు నుండి వస్తున్న ప్రతి ప్రాజెక్ట్ కు గొప్ప ఆదరణ వస్తోంది. చాలా పరిశ్రమలు తెలుగు ఇండస్ట్రీని ఫాలో అవ్వడం గమనించాను. తెలుగు ప్రేక్షకులకు సినిమా పట్ల వున్న అభిమానం, ప్రేమే దీనికి కారణం. నేనూ తరచూ తెలుగు సినిమాలు చూస్తాను. అందరూ ఇష్టమే. ఇక సినిమాల సెలక్షన్ అంశానికి వస్తే… తమిళ్, తెలుగు, మలయాళీ ప్రేక్షకుల అభిమానం నాకు లభించింది. సినిమాల ఎంపికలో నాకు ఎలాంటి తొందరలేదు. మంచి కథ, గుర్తుపెట్టుకునే పాత్రలు చేయాలనేది నా ప్రయత్నం” అని తెలిపింది.
