విలక్షణ నటుడు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ ఇప్పుడో మలయాళ చిత్రంలో నటిస్తోంది. మోహన్ లాల్ హీరోగా తెరకెక్కుతున్న ‘మాన్ స్టర్ ‘ అనే మూవీలో మంచు లక్ష్మీది చాలా కీలకమైన పాత్ర. అందుకోసం ప్రత్యేకంగా కేరళకు చెందిన అతి పురాతన యుద్థకళ కలరిపయట్టు ను రాత్రీ పగలూ తేడా లేకుండా ప్రాక్టీస్ చేస్తోంది. విశేషం ఏమంటే… రెండు రోజుల క్రితం మంచు లక్ష్మీ ఈ యుద్థకళను ప్రాక్టీస్ చేస్తున్న చిన్నపాటి వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
ఇక గురువారం ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మంచు లక్ష్మీ ఫోటోను పోస్ట్ చేసి, ‘ఈమె ఎవరో గెస్ చేయండి?’ అంటూ నెటిజన్లు పరీక్ష పెట్టాడు. ఆ తర్వాత కాసేపటికే ఆమె మంచు లక్ష్మీ అనే విషయాన్ని రివీల్ చేస్తూ, పొగడ్తలలో ముంచెత్తాడు. ‘నువ్వు చేయలేని పని ఏదైనా అసలు ఉందా? నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నాను”అంటూ కితాబిచ్చాడు. దానికి మంచు లక్ష్మీ హర్షం వ్యక్తం చేస్తూ, ‘ఓ ఆర్టిస్టుగా నేను చేయలేనిది ఏదీ లేదు. అందుకే నన్ను నేను ఆర్టిస్టిక్ కిల్లర్ గా చెప్పుకుంటాను” అని బదులిచ్చింది. మొత్తానికీ మలయాళ ‘మాన్ స్టర్’లో మనకో కొత్త మంచు లక్ష్మీ కనిపించడం ఖాయమనిపిస్తోంది.