ఈవెంట్లలో సూపర్ స్టార్ మహేశ్ బాబు చాలావరకు సెటిల్డ్గానే ఉంటారు. వస్తారు, అభిమానుల్లో జోష్ నింపే ప్రసంగం ఇస్తారు, వెళ్ళిపోతారు.. అంతే తప్ప స్టెప్పులేసిన దాఖలాలు లేవు. అలాంటి మహేశ్.. తొలిసారి కర్నూలులో జరిగిన ‘సర్కారు వారి పాట’ సక్సెస్లో మీట్లో వేదికపై స్టెప్పులేశారు. తొలుత తమన్ వేదికపైకి వెళ్ళి డ్యాన్సర్లతో స్టెప్పులు కలపగా, ఆ వెంటనే మహేశ్ స్వయంగా వేదికెక్కి తన ‘మ మ మహేశ్’ పాటకి ఎనర్జిటిక్గా స్టెప్పులు వేశారు. దీంతో, ఆ ప్రాంగణం మొత్తం దద్దరిల్లిపోయింది. తమ అభిమాన హీరో లైవ్లో స్టెప్పులేయడాన్ని చూసి, ఫ్యాన్స్ ఉర్రూతలూగిపోయారు.
అంతేకాదు.. తానిలా స్టెప్పులు వేయడానికి గల కారణమేంటో కూడా మహేశ్ వివరించారు. అప్పుడెప్పుడో ‘ఒక్కడు’ షూటింగ్ కోసం తాను కర్నూలుకి వచ్చానని, ఇప్పుడు ఇన్నేళ్ళ తర్వాత ‘సర్కారు వారి పాట’ సక్సెస్ మీట్ కోసం ఇక్కడికి వచ్చానన్నారు. తన కోసం ఇంతమంది అభిమానులు తరలి వస్తారని తాను ఊహించలేదని, ఆ ఆనందంతోనే మీ (ఫ్యాన్స్ని ఉద్దేశిస్తూ) కోసం తొలిసారి స్టెప్పులు వేశానని మహేశ్ చెప్పారు. తనకోసం వచ్చినందుకు థాంక్యూ చెప్పిన మహేశ్.. మీ అభిమానం, ఆశీస్సులు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానన్నారు. ఇదేదో సక్సెస్ మీట్లా లేదని, వంద రోజుల ఫంక్షన్లా అనిపిస్తోందని.. ఫంక్షన్లంటూ చేస్తే రాయలసీమలోనే చేయాలన్నట్టుగా ఉందని మహేశ్ చెప్పుకొచ్చారు.