ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా ఇప్పుడు ‘మ్యాడ్ స్క్వేర్’పై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లేలా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ట్రైలర్ నవ్వులు పూయించింది. మొదటి భాగంతో పోలిస్తే రెట్టింపు వినోదాన్ని మ్యాడ్ స్క్వేర్ లో చూడబోతున్నామని ట్రైలర్ తో మరోసారి రుజువైంది.ట్రైలర్ ను గమనిస్తే, మ్యాడ్ విజయానికి కారణమైన ప్రత్యేక శైలి హాస్యం, ప్రధాన పాత్రల అల్లరిని మ్యాడ్ స్క్వేర్ లో కూడా చూడబోతున్నామని అర్థమవుతోంది. హాస్యాస్పదమైన సంభాషణలు మరియు విచిత్రమైన పరిస్థితులతో మ్యాడ్ స్క్వేర్ వినోదాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్తుంది.
అలాగే తమన్ అద్భుతమైన నేపథ్య సంగీతం ట్రైలర్ కు ప్రధాన బలాలలో ఒకటిగా నిలిచింది. విడుదలైన నిమిషాల్లోనే ఈ ట్రైలర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రానికి సంగీత సంచలనం భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘లడ్డు గానీ పెళ్లి, ‘స్వాతి రెడ్డి’, ‘వచ్చార్రోయ్’ పాటలు చార్ట్బస్టర్ లుగా నిలిచాయి. మ్యాడ్ సినిమాతో థియేటర్లలో నవ్వుల వర్షం కురిపించిన దర్శకుడు కళ్యాణ్ శంకర్, సీక్వెల్ తో మరోసారి నవ్వుల విందుని అందించబోతున్నారు. ప్రధాన పాత్రలు పోషించిన నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ త్రయం మొదటి భాగానికి మించిన అల్లరి చేయబోతున్నారు. మ్యాడ్ స్క్వేర్ ను శ్రీకర స్టూడియోస్ తో కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ప్రేక్షకులు ఊహించిన దానికంటే ఎక్కువ వినోదాన్ని మ్యాడ్ స్క్వేర్ లో చూడబోతున్నారని చిత్ర బృందం తెలిపింది. భారీ అంచనాల నడుమ 2025, మార్చి 28న థియేటర్లలో అడుగు పెట్టనున్న మ్యాడ్ స్క్వేర్, ఈ వేసవికి ప్రేక్షకులకు మరిచిపోలేని వినోదాన్ని పంచనుంది.