Tollywood: మధ్యప్రదేశ్లోని పర్యాటక స్థలాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం సంపాదించే పనిలో పడింది అక్కడి టూరిజం శాఖ. దక్షిణాదికి చెందిన ఏ భాషా చిత్రమైనా యాభై శాతం షూటింగ్ ను తమ రాష్ట్రంలో చేస్తే కోటిన్నర నుండి రెండు కోట్ల వరకూ నగదు ప్రోత్సాహకాలు ఇస్తామని చెబుతోంది. అక్కడ ప్రభుత్వ లొకేషన్స్ కు చెల్లించే సొమ్ములో 75 శాతం శాతం వెనక్కి ఇచ్చేస్తోంది. ఆ రాష్ట్రం నలుమూలలా ఇబ్బందులు లేకుండా షూటింగ్ చేసుకునేందుకు అనుమతులు చాలా సులభంగా లభించేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని చెబుతోంది.
ఈ విషయాలు వెల్లడించేందుకు మధ్యప్రదేశ్ టూరిజం బోర్డ్ డిప్యూటీ డైరెక్టర్ ఉమాకాంత్ చౌదరి తన సిబ్బందితో సహా ఇటీవల హైదరాబాద్ విచ్చేశారు. దళారులు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవచ్చని ఆయన ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ప్రతి విషయం అత్యంత పారదర్శకంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
ఆ వివరాలను తెలియచేస్తూ, ”షూటింగ్ పర్మిషన్స్ జారీ చేయడం మొదలుకుని నిర్ణీత వ్యవధిలో రాయితీ అందించడం వరకు ప్రతి ఒక్కటి పారదర్శకంగా ఉంటుంది. దేశంలో మరెక్కడా లేని అద్భుత సందర్శనీయ ప్రాంతాలు మధ్య ప్రదేశ్ లో ఉన్నాయి. వాటిని ప్రపంచానికి పరిచయం చేయడం, ఈ ప్రోత్సాహకాల ముఖ్య ఉద్దేశ్యం” అని అన్నారు. ఇందుకోసం రూపొందించిన వెబ్ సైట్ ద్వారా అన్ని విషయాలు సమగ్రంగా తెలుసుకోవచ్చని ఉమాకాంత్ ప్రకటించారు. ఈ అవకాశం దక్షిణ భాషా చిత్రాలన్నింటికీ వర్తిస్తుందని వివరించారు.
మధ్యప్రదేశ్ పర్యాటక సంస్థ కల్పిస్తున్న ఈ అరుదైన అవకాశాన్ని వినియోగించుకుని, ‘తప్పించుకోలేరు’ చిత్రాన్ని తెరకెక్కించి సౌత్ ఇండియాలోనే మొట్టమొదటిసారి నగదు ప్రోత్సాహకం అందుకున్న దర్శకనిర్మాత రుద్రాపట్ల వేణుగోపాల్ తన అనుభవాన్ని ఈ సందర్భంగా పంచుకున్నారు. నిర్మాతలు ఆచంట గోపీనాథ్, బెక్కెం వేణుగోపాల్, డి. ఎస్. రావు, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, యువ దర్శకులు చందా గోవింద్ రెడ్డి, భీమినేని శివప్రసాద్, తన్నీరు రాంబాబు, గౌతమ్ రాచిరాజు, రైటర్ రవిప్రకాష్ తదితరులను రుద్రాపట్ల వేణుగోపాల్ మధ్యప్రదేశ్ టూరిజం బోర్డ్ డిప్యూటీ డైరెక్టర్ ఉమాకాంత్ చౌదరికి పరిచయం చేశారు. మధ్యప్రదేశ్ టూరిజం బోర్డ్ అందిస్తున్న ఈ అరుదైన అవకాశాన్ని వినియోగించు కోవాలనుకునే వారు సహాయ సలహాల కొరకు తనను నేరుగా సంప్రదించవచ్చని, తన రెండో చిత్రం మధ్యప్రదేశ్ లోని పలు లోకేషన్స్ లో త్వరలోనే ప్రారంభం కానుందని వేణుగోపాల్ తెలిపారు.