రేపటి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కానీ తెలంగాణలో ఫిబ్రవరి 1 నుండి విద్యాసంస్థల నిర్వహణకు ప్రభుత్వం అనుమతిచ్చేసింది. కొన్ని రాష్ట్రాలలోనూ రాత్రి కర్ఫ్యూను, వీకెండ్ లాక్ డౌన్ ను ఎత్తివేశారు. సో… సినిమా నిర్మాతలూ కాస్తంత ఊపిరి పీల్చుకుని ఆశావాహ దృక్పథంతో థియేటర్లలో తమ చిత్రాలను విడుదల చేయడానికి సన్నాహాలు మొదలు పెట్టారు. అలా దాదాపు రెండేళ్ళ క్రితం మొదలై, విడుదల కాకుండా ఆగిపోయిన శ్రీకాంత్ ‘కోతల రాయుడు’ సినిమా సైతం ఫిబ్రవరి 4న జనం ముందుకు వచ్చేస్తోంది. ఇటీవలే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, ‘యు’ సర్టిఫికెట్ పొందింది.
సుధీర్ రాజు దర్శకత్వంలో ఎ. ఎస్. కిశోర్, కొలన్ వెంకటేశ్ నిర్మించిన ‘కోతల రాయుడు’కు సునిల్ కశ్యప్ సంగీతం అందించాడు. శ్రీకాంత్ సరసన అందాల భామలు డింపుల్ చోప్డా, నటాషా దోషి, ప్రాచీ సిన్హా నటించారు. మాటలతో మాయచేసే పాత్రను శ్రీకాంత్ చేస్తున్నాడని, అందుకే ‘కోతల రాయుడు’ అనే టైటిల్ పెట్టామని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. గతంలో చిరంజీవి హీరోగానూ ‘కోతలరాయుడు’ పేరుతో ఓ సినిమా వచ్చింది. మరి ‘అఖండ’లో ప్రతినాయకుడిగా నటించి మెప్పించిన శ్రీకాంత్ ఇప్పుడీ ‘కోతల రాయుడు’గా ఏ మేరకు ఆకట్టుకుంటాడో చూడాలి.