తమిళ సంగీత మాంత్రికుడు ఇళయరాజా పేరు మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భారతీయ సినిమా సంగీతానికి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఈ దిగ్గజానికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలని, తమిళనాడు ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించినట్లు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ చెన్నైలో జరిగిన ప్రత్యేక సన్మాన కార్యక్రమంలో ప్రకటించారు. ఇళయరాజా సినీ ప్రయాణం 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయనకు జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరించారు.
Also Read : ‘Mirai’ : పారితోషికం లొసుగుతో ‘మిరాయ్’ను వదులుకున్న స్టార్ హీరో..
ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ మాట్లాడుతూ, కృషి, నైపుణ్యం ఉంటే ఏదైనా సాధ్యమని ఇళయరాజా నిరూపించారని పేర్కొన్నారు. సంగీతం ఆయనకు జీవితం, భావోద్వేగాలను మేల్కొలిపే శక్తి ఆయన స్వరాల్లో ఉందని కొనియాడారు. ఆయన సేవలను గుర్తిస్తూ భారతరత్నకు ప్రతిపాదిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా ఇళయరాజా పేరుతో ప్రతి సంవత్సరం ప్రత్యేక సంగీత పురస్కారాన్ని ఏర్పాటు చేసి ప్రతిభావంతులైన కళాకారులను గౌరవిస్తామని ప్రకటించారు. ఈ వేడుకకు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, మంత్రి సామినాథన్తో పాటు సినీ లెజెండ్స్ రజనీకాంత్, కమల్ హాసన్ తదితరులు హాజరయ్యారు. స్టేజ్పై పలువురు ప్రముఖులు ఇళయరాజా సంగీత మాంత్రికం గురించి తమ అనుభవాలను పంచుకొని ఆయన ప్రతిభను ప్రశంసించారు.