మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్న సినిమా ‘మ్యూజిక్ స్కూల్’. ఈ సినిమా నేపథ్య సంగీతానికీ బుడాపెస్ట్ లో తుది ముస్తాబులు చేశారు. అక్కడి ఆర్కెస్ట్రాతో రికార్డింగ్ ను ఇళయరాజా ఇటీవల పూర్తి చేశారు. మొత్తం 11 పాటలున్న ఈ సినిమాను పాపారావు బియ్యాల రాసి, దర్శకత్వం వహించారు. హైదరాబాద్ కు చెందిన యామినీ ఫిల్మ్స్ దీనిని నిర్మిస్తోంది. ఆస్కార్ అందుకున్న ‘ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్’లో మూడు పాటలు ఈ చిత్రం కోసం చేశారు. ‘సౌండ్ ఆఫ్ మ్యూజిక్’ని మ్యాచ్ చేయడానికి ఈ సినిమా నేపథ్య సంగీతాన్ని బుడాపెస్ట్ లో చేయాలనుకున్నామని ఇళయరాజా తెలిపారు.
ఈ విషయం గురించి దర్శకుడు పాపారావు బియ్యాల మాట్లాడుతూ, ”సింఫనీ ఆర్కెస్ట్రాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి చాలా భాగాలను ఇళయరాజా రాశారు. అందుకే మేం బుడాపెస్ట్ సింఫనీ ఆర్కెస్ట్రాని అప్రోచ్ అయ్యాం. ఇప్పుడున్న లీడింగ్ ఆర్కెస్ట్రాలో అది ప్రపంచంలో అత్యుత్తమ స్థానంలో ఉంది. ఇళయరాజా గారు మా కోసం చాలా సమయం వెచ్చించారు. ఈ ప్రాజెక్ట్ మీద ఆయన పెట్టిన శ్రద్ధ చూసి చాలా ఆనందంగా అనిపించింది” అని అన్నారు. లండన్ ఫిలహార్మోనిక్ ఆర్కెస్ట్రాలో మూడు పాటలకు సంబంధించిన ఆర్కెస్ట్రైజేషన్ సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందే పూర్తయ్యింది. ఆ పాటలు విన్న తర్వాత మిగిలిన పాటలకు సంబంధించిన పనులను బుడాపెస్ట్ సింఫనీలో చేస్తే అంతే గొప్ప క్వాలిటీ వస్తుందని సంగీత దర్శకుడు, దర్శకుడు భావించారు. బుడాపెస్ట్ లోని టామ్ టామ్ స్టూడియోలో ఈ రికార్డింగ్ జరిగింది. బుడాపెస్ట్ సింఫనీ ఆర్కెస్ట్రాను లస్జ్లో కోవాక్స్ కండక్ట్ చేశారు.
విద్యా వ్యవస్థ, తల్లిదండ్రులు పిల్లలపై పెడుతున్న ఒత్తిడి, నిర్విరామంగా సాగుతున్న చదువుకునే గంటలు వంటి వాటిని ప్రస్తావించే చిత్రమిది. కళలకు, ఇతర వ్యాపకాలకు అసలు టైమ్ లేకుండా చేసి ఇంజనీర్లు, డాక్టర్లుగా మార్చడానికి విద్యార్థులను ఎలా రుబ్బుతున్నారో చెప్పే చిత్రమిది. శ్రియా శరణ్, శర్మన్ జోషి, షాన్, ప్రకాష్ రాజ్, సుహాసిని మూలే, బెంజమిన్ గిలాని, గ్రేసీ గోస్వామి, ఓజు బరువా ఇందులో కీలక పాత్రల్లో నటించారు. ఏస్ సినిమాటోగ్రాఫర్లలో ఒకరైన కిరణ్ డియోహాన్స్ కెమెరామేన్గా పనిచేశారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 12న టొరెంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ, 18న ఇండస్ట్రీ / మార్కెటింగ్ సెక్షన్లోనూ ప్రదర్శించబోతున్నారు.