Site icon NTV Telugu

వైవిధ్యంతో సాగుతున్న క్రిష్!

నవతరం దర్శకుల్లో తనదైన అభిరుచిని చాటుకుంటూ సాగుతున్నారు జాగర్లమూడి రాధాకృష్ణ. అందరూ ‘క్రిష్’ అంటూ అభిమానంగా పిలుచుకుంటారు. ఆయన కూడా టైటిల్స్ లో ‘క్రిష్’ అనే ప్రకటించుకుంటారు. తన ప్రతి చిత్రంలోనూ ఏదో వైవిధ్యం చూపించాలన్న తలంపుతోనే క్రిష్ పయనిస్తున్నారు. తనకంటూ కొంతమంది ప్రేక్షకులను అభిమానులుగా సంపాదించుకోగలిగారు క్రిష్.

జాగర్లమూడి రాధాకృష్ణ 1978 నవంబర్ 10న జన్మించారు. గుంటూరు జిల్లా వినుకొండ వారి స్వస్థలం. అమెరికాలో ఫార్మసీ అండ్ కంప్యూటర్ సైన్సెస్ లో పట్టా పొంది, కొంతకాలం అక్కడే పనిచేశారు. అమెరికాలో ఉన్న సమయంలోనే క్రిష్ మనసు సినిమాలవైపు మళ్ళింది. సినిమా టెక్నిక్ ను అధ్యయనం చేశారు క్రిష్. స్వదేశం వచ్చిన తరువాత అల్లరి నరేశ్, శర్వానంద్ హీరోలుగా ‘గమ్యం’ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రంలో ఓ సన్నివేశంలో నక్సలైట్ గానూ క్రిష్ కనిపించారు. ఈ చిత్రాన్ని క్రిష్ తండ్రి జాగర్లమూడి సాయిబాబు నిర్మించారు. ‘గమ్యం’తోనే దర్శకునిగా మంచి పేరు లభించింది. ఆ తరువాత క్రిష్ దర్శకత్వంలో రూపొందిన “వేదం, కృష్ణం వందే జగద్గురుమ్” చిత్రాలు సైతం జనాన్ని భలేగా ఆకట్టుకున్నాయి. ‘వేదం’ చిత్రాన్ని తమిళంలో ‘వానమ్’ పేరుతో క్రిష్ తెరకెక్కించారు. తమిళంలో ఘనవిజయం సాధించిన ‘రమణ’ ఆధారంగా తెలుగులో చిరంజీవి ‘ఠాగూర్’ రూపొందింది. ఇదే కథను హిందీలో ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’ పేరుతో క్రిష్‌ రీమేక్ చేశారు. ఈ చిత్రాన్ని సంజయ్ లీలా భన్సాలీ నిర్మించడం విశేషం. తరువాత రెండవ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ‘కంచె’ అనే సినిమా రూపొందించారు క్రిష్. ఈ చిత్రాలన్నీ క్రిష్ కు దర్శకునిగా మంచి పేరు సంపాదించి పెట్టాయి. అయితే క్రిష్ కు బాక్సాఫీస్ బంపర్ హిట్ ను మాత్రం చారిత్రక చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ అందించింది. బాలకృష్ణ నూరవ చిత్రంగా రూపొందిన ‘గౌతీమీపుత్ర శాతకర్ణి’ కమర్షియల్ సక్సెస్ తో పాటు పేరు కూడా సంపాదించి పెట్టింది.

హిందీలో ‘మణికర్ణిక: ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ’కి దర్శకత్వం వహించారు క్రిష్. కొంత భాగం ఉండగానే, కొన్ని అనివార్య కారణాలవల్ల ఆ చిత్రం నుండి తప్పుకున్నారు. మిగతా భాగాన్ని చిత్ర కథానాయిక కంగనా రనౌత్ పూర్తిచేశారు. యన్టీఆర్ బయోపిక్ గా తెరకెక్కిన “కథానాయకుడు, మహానాయకుడు” రెండు భాగాలను క్రిష్ రూపొందించారు. బాలకృష్ణ సొంతగా నిర్మించిన ఈ చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయాయి. రాయలసీమ జీవనవిధానం నేపథ్యంగా సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవలను అదే పేరుతో చిత్రంగా రూపొందించారు క్రిష్. ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించాడు. ‘కొండపొలం’ బాక్సాఫీస్ వద్ద ఏ మాత్రం మ్యాజిక్ చేయలేకపోయింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ ‘హరిహర వీరమల్లు’ అనే పీరియడ్ మూవీని తెరకెక్కిస్తున్నారు. రాబోయే ఏప్రిల్ 29న ‘హరిహర వీరమల్లు’ జనం ముందు నిలవనుందని తెలుస్తోంది.

క్రిష్ తన చిత్రాలలో అతిథి పాత్రల్లో కనిపించి అలరిస్తుంటారు. తొలి చిత్రం ‘గమ్యం’లో నక్సలైట్ గా కనిపించిన క్రిష్, తరువాత తన ‘వేదం’, ‘వానం’ చిత్రాల్లో సాధువుగా నటించారు. నాగ్ అశ్విన్ రూపొందించిన ‘మహానటి’లో కేవీ రెడ్డి పాత్రలో కనిపించారు. తన ‘యన్టీఆర్ కథానాయకుడు’లోనూ కేవీ రెడ్డిగా దర్శనమిచ్చారు. తొలి చిత్రం ‘గమ్యం’తోనే ఉత్తమ దర్శకునిగా నంది అవార్డును సంపాదించారు క్రిష్. ఆయన తెరకెక్కించిన ‘కంచె’కు జాతీయ స్థాయిలో ఉత్తమ తెలుగు చిత్రం అవార్డు లభించింది. రాబోయే ‘హరి హర వీరమల్లు’తో క్రిష్ ఎలా అలరిస్తారో చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు. మరి ఆ చిత్రంతో క్రిష్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.

Exit mobile version