తెలుగు పాటల తోటమాలి … దేవులపల్లి కృష్ణశాస్త్రి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగుపాటకు వెలుగురేఖలు పొదిగిన వారిలో దేవులపల్లి వేంకటకృష్ణ శాస్త్రి కలం భలేగా పరుగులు తీసింది. చిత్రసీమలో అడుగు పెట్టక ముందే తెలుగుదేశమంతటా కృష్ణశాస్త్రి భావకవిత్వం చిందులు వేసింది. సినిమా రంగంలో ‘మనసున మల్లెల మాలలు ఊగించిన కవి’గా నిలచిపోయారు కృష్ణశాస్త్రి. ఆకాశవీధిలో సాగే మేఘమాలలతో ప్రేయసీప్రియుల నడుమ రాయబారాలు నడిపి, ‘చిత్ర మేఘసందేశం’ పలికించిన ఘనుడాయన! ‘పాడనా తెలుగు పాట…’ అంటూ పరవశింప చేసినదీ ఆయనే! ఏ తీరున చూసినా తెలుగు పాటల తోటలో కృష్ణశాస్త్రి వేసిన బాట భావితరం కవులకు భావుకతను చూపింది.
దేవులపల్లి వేంకటకృష్ణశాస్త్రి 1897 నవంబర్ 1న తూర్పు గోదావరి జిల్లా, పిఠాపురం సమీపంలోని రావువారి చంద్రపాలెంలో జన్మించారు. ఆయన తండ్రి, పెదనాన్న ఇద్దరూ ఆ రోజుల్లో మహాపండితులు. వారింట్లో నిత్యం ఏదో ఒక సాహితీగోష్ఠి సాగుతూ ఉండేది. మాతృభాష తెలుగులో అపారపాండిత్యం సంపాదించారు కృష్ణశాస్త్రి. ఆంగ్లంలోనూ మంచి పట్టు సాధించారు. విజయనగరంలో డిగ్రీ పూర్తి చేసి, కాకినాడ మిషన్ హైస్కూల్ లో ఉపాధ్యాయునిగా పనిచేశారు కృష్ణశాస్త్రి. బ్రహ్మసమాజ ప్రభావం ఆయనపై చాలా ఉండేది.
Also Read
మొదటి భార్య మరణించిన తరువాత బ్రహ్మసమాజంలో చురుకుగా సాగారు. ఆ సమయంలోనే వైద్యం కోసం బళ్ళారి వెళ్తూ ‘కృష్ణపక్షం కావ్యం’ రచించారు. తెలుగునేలను ఆ కావ్యం ఎంతగానో పులకింపచేసింది. కృష్ణశాస్త్రికి అభిమాన సంఘాలు వెలిశాయి. ఆయనలాగా గిరిజాల జుట్టు పెంచి ఎంతోమంది కవులు బయలుదేరి భావకవిత్వాన్ని పలికించారు.
1929లో విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ తో కృష్ణ శాస్త్రికి పరిచయం ఏర్పడింది. వారిద్దరూ తరచూ లేఖల ద్వారా సాహితీచర్చలు సాగించేవారు. కృష్ణశాస్త్రి పాటపై మనసు పడ్డ దర్శకులు బి.యన్.రెడ్డి తన ‘మల్లీశ్వరి’ సినిమాలో అన్ని పాటలూ రాయడానికి ఆయనను పిలిపించుకున్నారు. ‘మల్లీశ్వరి’ని బి.యన్.రెడ్డి సూచనల మేరకు పాటలతోటగా మలిచారు కృష్ణశాస్త్రి. 70 ఏళ్ళ నాటి ‘మల్లీశ్వరి’ పాటలు ఈ నాటికీ జనాన్ని మురిపిస్తూనే ఉండడం విశేషం.
ఆకాశవాణిలోనూ కృష్ణశాస్త్రి రాసిన ఎన్నో గేయాలు, నాటికలు వెలుగు చూశాయి. కృష్ణశాస్త్రి భావకవిత్వం రాజ్యమేలుతున్న రోజుల్లోనే శ్రీశ్రీ తన విప్లవకవిత్వాన్నీ వినిపించారు. సాహితీప్రియులు ఇద్దరి రచనలనూ ఎంతగానో ప్రేమించారు. చిత్రసీమలోనూ ఇద్దరి పాటలు జనాన్ని మురిపించాయి. ‘మల్లీశ్వరి’తో మధురం పంచడం ఆరంభించిన కృష్ణశాస్త్రి కడదాకా తెలుగువారిని పులకింపచేస్తూనే సాగారు. ‘మల్లీశ్వరి’లోనే “ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు…” అంటూ జనానికి హాయిని కలిగించారు కృష్ణశాస్త్రి. ఆ తరువాత నుంచీ కృష్ణశాస్త్రి పాటలు హాయిని కలిగిస్తూనే సాగాయి.
నాగయ్య ‘నా ఇల్లు’లోని “అదిగదిగో గగనసీమ…”, ‘బంగారు పాప’లోని “యవ్వన మధువనిలో…”, ‘భాగ్యరేఖ’లోని “నీవుండేదా కొండపై… నా స్వామి…”, ‘రాజమకుటం’లోని “సడిసేయకో గాలి…”, ‘సుఖదుఃఖాలు’లోని “ఇది మల్లెల వేళయనీ…”, ‘ఉండమ్మా బొట్టు పెడతా’లోని “రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా…”, ‘ఏకవీర’లోని “ప్రతీరాత్రి వసంతరాత్రి…”, ‘మాయని మమత’లోని “రానిక నీ కోసం సఖీ…”, ‘భక్త తుకారాం’లోని “ఘనాఘన సుందరా…కరుణారస మందిరా…”, ‘సీతామాలక్ష్మి’లోని “మావిచిగురు తినగానే…”, ‘గోరింటాకు’లోని “గోరింటా పూచిందీ కొమ్మా లేకుండా…”, ‘కార్తీకదీపం’లోని “ఆరనీకుమా ఈ దీపం… కార్తీక దీపం…”, ‘అమెరికా అమ్మాయి’లోని “పాడనా తెలుగు పాట…”, ‘మేఘసందేశం’లోని “ఆకులో ఆకునై…” పాటలు కృష్ణశాస్త్రి కలం నుండి జాలువారినవే. ఈ నాటికీ సాహితీ ప్రియులను ఆనందడోలికల్లో ఊగిస్తున్నాయి. 1980 ఫిబ్రవరి 24న కృష్ణశాస్త్రి కన్నుమూశారు. ఆయన పాటలు మాత్రం నవతరాన్ని సైతం మురిపిస్తూనే ఉండడం విశేషం.
తాజావార్తలు
-
Daycare Abuse: మీకు మనసెలా వచ్చిందమ్మా.. టాయిలెట్ జెట్తో నీళ్లు చల్లి, వాషింగ్ మెషీన్లో బంధించి చిన్నారిపై చిత్రహింసలు
-
Microsoft Layoffs: ఐటీ ఉద్యోగులకు మళ్లీ బ్యాడ్ న్యూస్.. మైక్రోసాఫ్ట్లో 5,000 మంది అవుట్! ఎవరెవరి ఉద్యోగాలు ఊడనున్నాయంటే?
-
OG 2: పవన్ కళ్యాణ్ కొత్త లుక్ వైరల్.. ‘ఓజీ 2’పై ఒక్క ఫోటోతోనే భారీ హైప్
-
UP Boy: వారంలో 3 రోజులు ఎల్కేజీ, 3 రోజులు ఫస్ట్ క్లాస్.. రెండు కుటుంబాల మధ్య నలిగిపోతున్న ఆరేళ్ల బాలుడు!
-
Green Chillies Storage Tips: ఈ సింపుల్ ట్రిక్ చాలు.. పచ్చిమిరపకాయలు వారాల తరబడి ఫ్రెష్గా ఉంటాయి
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?