సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారం చేసిన రోజుల వ్యవధిలోనే తమిళ సినీ అభిమానులకు ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అందించారు. నిజానికి గత కొంతకాలంగా తమిళనాడులో కనుమరుగైన స్పెషల్ షోల కల్చర్ మళ్లీ మొదలయ్యేలా విజయ్ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సూర్య హీరోగా నటించిన ‘కరుప్పు’ సినిమా ఉదయం తొమ్మిది గంటల స్పెషల్ షోలకు అఫీషియల్ అప్రూవల్ అందింది. దీంతో థియేటర్ల దగ్గర రచ్చ చేయడానికి సూర్య ఫ్యాన్స్ రెడీ అయిపోతున్నారు. నిజానికి తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, విజయ్ రూలింగ్లో ఒక సినిమాకు ఎర్లీ మార్నింగ్ షోస్ పర్మిషన్ రావడం ఇదే మొదటిసారి. సినిమా పరిశ్రమ కష్టాలు, అభిమానుల ఆనందం, బాక్సాఫీస్ లెక్కలు పూర్తిగా తెలిసిన హీరోగా విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు తమిళ సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
నిజానికి తమిళనాడులో తెల్లవారుజామునే థియేటర్ల దగ్గర పాలాభిషేకాలు, పూలదండలు, క్రాకర్లతో ఫ్యాన్స్ చేసే పండగ వాతావరణం ఒక రేంజ్లో ఉండేది. కానీ గత ప్రభుత్వాల కఠిన ఆంక్షల నేపథ్యంలో ఆ సెలబ్రేషన్స్ అన్నీ ఆగిపోయాయి. ఇప్పుడు ‘కరుప్పు’ సినిమాతో మళ్ళీ ఆ స్పెషల్ షోస్ కల్చర్ తిరిగి రావడంతో, బాక్సాఫీస్ వద్ద మునుపటి వైభవం కనిపించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఇక సూర్య హీరోగా నటించిన ‘కరుప్పు’ సినిమాని తెలుగులో ‘వీరభద్రుడు’ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకి డైరెక్టర్గా ఆర్జే బాలాజీ వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాని తెలుగులో ప్రతిష్టాత్మక ‘అన్నపూర్ణ స్టూడియోస్’ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది.
