తలపతి విజయ్ లగ్జరీ కారు కాంట్రవర్సీ మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా ఈ కేసులో మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పు విజయ్ కు ఊరటనిచ్చింది. 2011-12 సంవత్సరంలో విజయ్ ఇంగ్లాండ్ నుంచి ఖరీదైన రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారును దిగుమతి చేసుకున్నారు. అప్పటికే ఆ కారు గురించి కస్టమ్స్ అధికారులకు పన్ను చెల్లించారు. అయితే అదే సమయంలో ఎంట్రీ ట్యాక్స్ కట్టే విషయంలో మినహాయింపు కావాలని కోరుతూ చెన్నై అసిస్టెంట్ కమిషనర్ కు లేఖ రాశారు. కానీ వారు దానికి అంగీకరించలేదు. దీంతో తాను దిగుమతి చేసుకున్న రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారు కోసం ఎంట్రీ టాక్స్ వసూలు చేయకుండా ఉండాలని టిఎన్ ప్రభుత్వం, సంబంధిత ప్రభుత్వ విభాగాలను ఆదేశించాలని కోర్టు తీర్పుని కోరుతూ నటుడు రిట్ ఆఫ్ మాండమస్ ను దాఖలు చేశారు. జస్టిస్ సుబ్రమణ్యం కొట్టివేసిన రిట్ పిటిషన్ తొమ్మిదేళ్లుగా పెండింగ్లో ఉంది. పన్ను చెల్లించకుండా ఉండటానికి పిటిషన్ దాఖలు చేసినందుకు న్యాయమూర్తి విజయ్ ని విమర్శించారు. పన్ను చెల్లించడం కర్తవ్యం అని, వారి ఇష్టానుసారం ఇవ్వడానికి అదేమీ విరాళం కాదని, పన్నులు చెల్లించే విషయంలో సెలెబ్రిటీలు రూల్స్ పాటించాలి అంటూ మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు జస్టిస్ సుబ్రమణ్యం బెంచ్ విజయ్ కు లక్ష రూపాయల జరిమానా విధించింది.
Read Also : ‘కె.జి.ఎఫ్. -2’ ఆలస్యానికి అదే కారణమా!?
దీంతో సింగిల్ బెంచ్ జస్టిస్ సుబ్రమణ్యం ఇచ్చిన తీర్పును విజయ్ సవాల్ చేయడంతో మరో బెంచ్ కు మార్చారు. తాజాగా ఈ కేసు విషయంలో హైకోర్టు సానుకూలంగా స్పందించింది. మునుపటి ఉత్తర్వు కాపీ లేనప్పటికీ, రిజిస్ట్రార్ కేసును షెడ్యూల్ చేయవచ్చని తెలుపుతూ విజయ్ పై విమర్శనాత్మక వ్యాఖ్యలతో కోర్టు గతంలో జారీ చేసిన ఉత్తర్వులకు స్టే ఇచ్చింది. అయితే టాక్స్ చలాన్ జారీ చేసిన వారంలోపు విజయ్ 80% పన్ను మొత్తాన్ని చెల్లించాలని హైకోర్టు న్యాయమూర్తులు ఆదేశించారు.