తెలంగాణలో లాక్డౌన్ను పూర్తిగా ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గిందని, కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని, వైద్యశాఖ అధికారులు నివేదిక అందించారు. ఈ నివేదికలను పరిశీలించిన రాష్ట్ర కేబినెట్ ఈ మేరకు పూర్తిస్థాయి లాక్ డౌన్ ను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకుంది. ఇక సినీప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా థియేటర్లు కూడా తెరచుకోనున్నాయి. జులై మొదటివారంలోనే పూర్తిస్థాయిలో థియేటర్లు తెరచుకొనే అవకాశం కనిపిస్తోంది. ఈమేరకు థియేటర్స్ అన్ని క్లీన్ అవుతున్నాయి. వాయిదా పడిన సినిమాలు సైతం విడుదల తేదీలను వరుసగా ప్రకటించనున్నాయి. మొదటి లిస్ట్ లో వాయిదా పడిన సినిమాలు తిరిగి విడుదల కానుండటంతో థియేటర్ల వద్ద జాతర మొదలుకానుంది. 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ నడిపించే అవకాశం కనిపిస్తోంది. కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా థియేటర్స్ యాజమాన్యం పాటించాల్సి ఉంటుంది.