C.Kalyan: హైదరాబాద్లోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన మాదాపూర్ పరిధిలో స్థల వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్పై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో తాజాగా ఫిర్యాదు నమోదైంది. సున్నం చెరువు సమీపంలోని తమ స్థలాలను ఆక్రమించేందుకు యత్నిస్తున్నారంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించడం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. బాధితుల కథనం ప్రకారం.. గుట్టల బేగంపేట్ పరిధిలోని సర్వే నంబర్లు 12, 12A, 13లలో సియాట్ సొసైటీకి చెందిన ప్లాట్లు ఉన్నాయి. అయితే ఈ రోజు ఉదయం నిర్మాత సి. కళ్యాణ్ తన అనుచరులతో కలిసి సదరు స్థలాల్లోకి అక్రమంగా చొరబడ్డారని సియాట్ సొసైటీ ప్రెసిడెంట్ శ్యామ్ సింగ్ ఆరోపించారు. అక్కడితో ఆగకుండా, స్థలాల చుట్టూ బ్లూ షీట్లను అడ్డుగా ఏర్పాటు చేసి అసలైన ప్లాట్ యజమానులు లోపలికి అడుగుపెట్టకుండా అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు.
గతంలోనూ కొందరు వ్యక్తులు ఈ భూములపై కన్నేసి ఆక్రమణలకు తెగబడగా వారిపై ఫిర్యాదులు చేశామని సొసైటీ ప్రతినిధులు గుర్తుచేశారు. తాజాగా మళ్లీ భూకబ్జా యత్నాలు ముమ్మరం కావడంతో సి. కళ్యాణ్తో పాటు ప్రకాష్ ధారక్, ప్రేమలత అనే వ్యక్తులపై కఠిన న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని ప్లాట్ ఓనర్లు మాదాపూర్ పోలీసులకు లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. సినీ పరిశ్రమలో సీనియర్ నిర్మాతగా పేరున్న సి. కళ్యాణ్ పేరు ఈ స్థల వివాదంలోకి రావడంతో ఈ వ్యవహారం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బాధితుల ఫిర్యాదు స్వీకరించిన మాదాపూర్ పోలీసులు దీనిపై విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో పోలీసులు ఎలాంటి చట్టపరమైన చర్యలు చేపడతారనేది ఆసక్తికరంగా మారింది.

