ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఇంతకుముందు కరోనా కష్టకాలంలో వలస కార్మికులకు చేసిన సాయంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురిసిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఆయన కష్టం అన్నవారికి కాదనకుండా ఆపన్నహస్తం అందిస్తున్నారు. ఎక్కడ కష్టం అనే మాట వినిపించిన అక్కడ వాలిపోతున్నారు. ప్రస్తుతం కోవిడ్ -19 మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ సమయంలోనూ సోనూసూద్ వేగంగా స్పందిస్తూ ప్రాణాలను కాపాడుతున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సోనూసూద్ చేస్తున్న సాయం ఆయనను పేదల పాలిట దేవుడిని చేస్తోంది. ఇటీవల బెంగళూరులోని ఒక ఆసుపత్రికి సోనూసూద్ వాలంటీర్ల బృందం 16కు పైగా ఆక్సిజన్ సిలిండర్లను అందించడంతో పాటు 22 మంది కోవిడ్ -19 రోగుల ప్రాణాలను కాపాడారు. సదరు ఆసుపత్రిలో ఆక్సిజన్ సిలిండర్ల అత్యవసర పరిస్థితి గురించి కర్ణాటకలోని సోను సూద్ ఛారిటీ ఫౌండేషన్ సభ్యుడికి ఒక పోలీసు అధికారి నుండి కాల్ వచ్చింది. దీంతో వెంటనే స్పందించింది సోనూసూద్ టీం. అంతేకాదు సోనూసూద్ ప్రాణాలతో పోరాడుతున్న వ్యక్తులను అత్యవసర చికిత్స కోసం విమానంలో హైరాబాద్ కు కూడా చేరుస్తున్నాడు. తాజాగా ముంబైలోని సోనూసూద్ ఇంటి దగ్గర జనం గుమిగూడినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రజలు సహాయాన్ని కోరుతూ సోనూసూద్ ఇంటికి చేరారు. అది చూసిన సోనూసూద్ బయటకు వచ్చి వాళ్ళ సమస్యలు తెలుసుకుని వారితో మాట్లాడి అన్ని విధాలా సహాయం చేస్తానని హామీ ఇచ్చారు.