కమల్ హాసన్ కుమార్తెగా సినీ రంగ ప్రవేశం చేసినా, తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది శృతిహాసన్. ఒక భాషకు పరిమితం కాకుండా తమిళ, తెలుగు, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ ఒకానొక సమయంలో టాప్ హీరోయిన్గా కూడా కొనసాగింది. అయితే తాజాగా ఈ భామ తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో ఒక సొంత ఇంటిని కొనుగోలు చేసింది. నిజానికి చెన్నై నగరంలో కమల్ హాసన్కు ఎన్నో వేల కోట్ల విలువైన భూములు, సొంత భవనాలు ఉన్నాయి. అయినా కూడా తండ్రి ఆస్తుల మీద ఆధారపడకుండా, తాను సంపాదించిన సొమ్ముతో శృతిహాసన్ ఒక నివాసాన్ని కొనుగోలు చేయడం విశేషం.
నిజానికి గత కొన్ని ఏళ్లుగా ముంబైలోనే ఎక్కువగా గడుపుతున్న శృతిహాసన్, ఇప్పుడు తన సొంత గడ్డ అయిన చెన్నైతో మరింత బంధాన్ని బలోపేతం చేసుకునేందుకు అక్కడ ఇంటిని కొనుగోలు చేసినట్లుగా చెబుతున్నారు. ఇక ఈ కొత్త ఇంట్లో శృతిహాసన్ సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి గృహప్రవేశం చేసింది. అయితే తమిళ సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు, ఈ వేడుకలో శృతిహాసన్ ఒంటరిగానే పాల్గొని పూజా విధులు పూర్తి చేసినట్లు చెబుతున్నారు. ఈ గృహప్రవేశం సమయంలో ఆమె కుటుంబ సభ్యులు ఎవరూ అక్కడ కనిపించకపోవడం హాట్ టాపిక్ అవుతోంది. ఈ మధ్యనే ఒక క్రేజీ సినిమాలోని స్పెషల్ సాంగ్లో మెరిసిన ఆమె, ‘సలార్ 2’లో ప్రభాస్ సరసన కూడా నటిస్తోంది.

