టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పుట్టు పూర్వోత్తరాల గురించి జానీ మాస్టర్ భార్య సుమలత, సీనియర్ డ్యాన్సర్ లక్ష్మి ఇష్టానుసారంగా మాట్లాడారని, ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫెడరేషన్తో పాటు డ్యాన్సర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు రఘు మాస్టర్కు ఆయన అధికారికంగా ఫిర్యాదు చేశారు. గత కొంతకాలంగా తనపై నిరాధారణమైన ఆరోపణలు చేస్తూ, తన మనోభావాలు దెబ్బతినేలా వారు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని శేఖర్ మాస్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. తనపై మోపిన అభియోగాలు, ఎటకారపు మాటలు తనను మానసికంగా ఎంతో బాధించాయని పేర్కొన్నారు. అసలు తన ప్రమేయమే లేని విషయాల్లోకి తనను లాగుతూ పుట్టు పూర్వోత్తరాల గురించి దారుణంగా వ్యాఖ్యానించడంపై ఆయన మండిపడ్డారు. ఈ వివాదాలను పెంచవద్దని, మీడియా ముందుకు వెళ్లొద్దని పరిశ్రమ పెద్దలు సూచించడంతోనే తాను ఇన్నాళ్లూ సంయమనం పాటించానని శేఖర్ మాస్టర్ స్పష్టం చేశారు. పెద్దల పట్ల ఉన్న గౌరవంతోనే మౌనంగా ఉన్నప్పటికీ, సుమలత ప్రవర్తించిన తీరు, ఆమె చేసిన వ్యాఖ్యలు శృతి మించడంతో పాటు తనకు తీవ్ర మనస్తాపం కలిగించాయని ఆయన తెలిపారు.
తన యూనియన్ సభ్యుల సంక్షేమం, వారికి సహాయ సహకారాలు అందించడంలో తాను ఎప్పుడూ ముందుంటానని శేఖర్ మాస్టర్ గుర్తుచేశారు. డ్యాన్సర్ల పర్సంటేజీల విషయంలో అన్యాయం జరుగుతోందని భావించినప్పుడు, వారి కోసం తాను ఎన్నో మంచి అవకాశాలను, హిట్ సాంగ్స్ను సైతం వదులుకున్నానని ఆయన వెల్లడించారు. యూనియన్ కోసమే నిలబడిన తనపై ఇలాంటి అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు. తనపై ఇష్టానుసారంగా అనుచిత వ్యాఖ్యలు చేసి వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించిన సుమలత, సీనియర్ డ్యాన్సర్ లక్ష్మి వెంటనే తనకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని శేఖర్ మాస్టర్ డిమాండ్ చేశారు.

