టాలీవుడ్ సినిమా ఈవెంట్లలో తన అద్భుతమైన హోస్టింగ్, స్పాంటేనిటీతో తక్కువ సమయంలోనే ప్రేక్షకుల మనసు దోచుకుంది చర్మిల నల్లూరి. ఈమె ప్రతిభను చూసి ఏకంగా స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, ప్రముఖ నిర్మాత కం దర్శకుడు ఎం.ఎస్. రాజు సైతం ఆమెను తమ సినిమాల్లో హీరోయిన్గా నటిస్తావా అంటూ ఆఫర్లు ప్రకటించారు. టాలీవుడ్లో ఎంతోమంది హీరోయిన్గా మారాలని కలలు కంటుంటే, ఇలాంటి గోల్డెన్ ఆఫర్లు వస్తే ఎవరైనా వెంటనే ఒప్పుకుంటారు. కానీ చర్మిల మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచే నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఆమెతో NTV Web ప్రత్యేకంగా సంభాషించింది. ఈ క్రమంలో ఆమె కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
స్టార్ ప్రొడ్యూసర్లు స్వయంగా సినిమా అవకాశాలు ఇస్తామన్నప్పటికీ, తనకు నటనపై ఎలాంటి ఆసక్తి లేదని చర్మిల స్పష్టం చేశారు. అంతేకాకుండా తన తల్లిదండ్రులకు కూడా తాను నటించడం ఇష్టం లేదని, వారి మాటకు వ్యతిరేకంగా నటన వైపు అడుగులు వేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. సినిమాల వైపు వెళ్లే ఆలోచన పూర్తిగా లేదని, కేవలం యాంరింగ్ రంగంలోనే మరింత పైస్థాయికి ఎదగడమే తన లక్ష్యమని ఆమె వెల్లడించారు. ఇండస్ట్రీ నుంచి, ప్రేక్షకుల నుంచి తనకు లభిస్తున్న అపారమైన ప్రేమపై చర్మిల భావోద్వేగంగా స్పందించారు. “ఎంతోమంది ఎంతో ప్రయత్నం చేసినా దొరకని అదృష్టం ఇది. ఆడియన్స్ నాపై చూపుతున్న అన్ కండిషనల్ లవ్కు జీవితాంతం రుణపడి ఉంటాను” అని ఆమె తెలిపారు. ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేనప్పటికీ, అల్లు అరవింద్, ఎం.ఎస్. రాజు వంటి దిగ్గజాలు తనను ఎంతగానో ప్రోత్సహిస్తూ మాట్లాడటం వారి గొప్పతనానికి నిదర్శనమని చర్మిల కొనియాడారు. వెండితెరపై మెరిసే అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించి, యాంకరింగ్పైనే పూర్తిగా దృష్టి పెట్టిన ఈ టాలెంటెడ్ బ్యూటీ నిర్ణయం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది.

