మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కాంబినేషన్లో దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కిస్తున్న పక్కా మాస్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (PEDDI). జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించి నేడు (మే 18న) ముంబైలో గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగనుంది. ఈ లోపే సినిమా ప్రీమియర్స్ (Early Premiers) గురించిన ఒక బ్యాడ్ న్యూస్ మెగా అభిమానులను కాస్త నిరాశకు గురిచేస్తోంది.
ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన తరుణంలో.. జూన్ 4న అఫీషియల్ రిలీజ్ కంటే ఒక రోజు ముందు, అంటే జూన్ 3వ తేదీ సాయంత్రం నుంచే ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున ప్రీమియర్ షోస్ ఉంటాయని మేకర్స్ ప్రచార చిత్రాలలో (Posters) అధికారికంగా వేసి వదిలారు. కానీ, గత రెండు మూడు రోజులుగా వస్తున్న ‘పెద్ది’ అఫీషియల్ పోస్టర్లను గమనిస్తే.. అందులో జూన్ 3 ప్రీమియర్స్ ప్రస్తావనను నెమ్మదిగా తొలగిస్తూ వస్తున్నారు. కేవలం జూన్ 4 రిలీజ్ డేట్ మాత్రమే హైలైట్ చేస్తున్నారు. దీనిని బట్టి ఒక్క ఓవర్సీస్ (U.S.A & Rest of World) మినహాయిస్తే.. ఇండియాలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ‘పెద్ది’ ముందస్తు ప్రీమియర్ షోలు ఉండే అవకాశం లేదని స్పష్టమవుతోంది.
అయితే మన దగ్గర ప్రీమియర్ షోలను క్యాన్సిల్ చేయడానికి ప్రధాన కారణం ఇటీవల టాలీవుడ్లో టికెట్ రేట్లు, బెనిఫిట్ షోల పర్మిషన్లపై వచ్చిన కొన్ని వివాదాలే అని ఇండస్ట్రీ టాక్. అంతేకాకుండా, పెద్ద సినిమాలకు ముందే ప్రీమియర్స్ వేయడం వల్ల ఒకవేళ నెగటివ్ టాక్ వస్తే మరుసటి రోజు ఓపెనింగ్స్ దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే మైత్రీ మూవీ మేకర్స్ ఎక్కడా రిస్క్ తీసుకోకుండా జూన్ 4న డైరెక్ట్ గా మార్నింగ్ షోల నుంచే సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా, ముంబైలో జరగబోయే ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో దర్శకుడు బుచ్చిబాబు సన లేదా నిర్మాతలు ఈ ప్రీమియర్స్ క్యాన్సిలేషన్పై పూర్తి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.
