Prabhas Fauzi: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే గతంలో ఆయన సినిమా షూటింగ్కు సంబంధించిన విషయాల్లో ఆయన పెద్దగా జోక్యం చేసుకోరనే ప్రచారం ఇండస్ట్రీలో ఉండేది. కానీ ప్రస్తుతం ‘ఫౌజీ’ విషయంలో మాత్రం డార్లింగ్ వ్యవహరిస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ‘సీతారామం’ ఫేమ్ హను రాఘవపూడి డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఫౌజీ’. ఈ చిత్రంపై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన మైత్రి రవి చెప్పిన విషయాలు ప్రభాస్ తన సినిమాపై ఎంత శ్రద్ధ పెడుతున్నారో తెలియజేస్తున్నాయి.
ఇటీవల నిర్వహించిన ఇరుముడి ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మైత్రి రవి మాట్లాడుతూ.. ప్రభాస్ షూటింగ్లో ఉన్నప్పుడు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు సెట్స్లోనే ఉంటున్నారని వెల్లడించారు. అంతేకాదు, తాను షూటింగ్లో పాల్గొనని రోజుల్లో కూడా సెట్స్కు వచ్చి మానిటర్ దగ్గర కూర్చొని చిత్రీకరిస్తున్న సన్నివేశాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నారని చెప్పారు. షూటింగ్లో చిన్న తేడా కూడా ఉండకూడదనే విషయంలో డార్లింగ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఇరుముడి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కోసం భీమవరం వెళ్లాల్సి ఉందని చెప్పినప్పుడు ప్రభాస్ ఆసక్తిగా స్పందించారని, కార్యక్రమం గురించి ఆరా తీశారని తెలిపారు. ఇక ‘ఫౌజీ’ చిత్రం విషయానికి వస్తే హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా మొదలై దాదాపు రెండేళ్లు కావస్తుండగా.. ప్రస్తుతం షూటింగ్ ముగింపు దశకు చేరుకున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన రెండు స్టిల్స్ మాత్రమే విడుదలయ్యాయి. డిసెంబర్ 3న సినిమాను థియేటర్లలోకి తీసుకురానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సినిమా ఔట్పుట్పై ప్రభాస్ ప్రత్యేకంగా దృష్టి పెట్టడంతో ‘ఫౌజీ’ అనుకున్న సమయానికి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. సినిమా కూడా అంచనాలకు తగ్గట్టుగా వస్తోందని చెబుతున్నారు. ప్రభాస్ ఇంతలా శ్రద్ధ తీసుకుంటున్న నేపథ్యంలో ‘ఫౌజీ’పై అభిమానుల్లో అంచనాలు మరింత పెరుగుతున్నాయి.

