ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ఫౌజీ’ సినిమా షూటింగ్ లో ఒక ఆందోళనకర విషయం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఈ సినిమా షెడ్యూల్ లో పాల్గొన్న ప్రముఖ బెంగాలీ, హిందీ సినిమాల నటుడు రాజేష్ శర్మను ఒక ప్రమాదకరమైన విష పురుగు కాటేసినట్లుగా తెలుస్తోంది. ఆ పురుగు ఏమిటనే విషయం మీద క్లారిటీ లేకపోయినా, సాలీడు అనే ప్రచారం జరుగుతోంది.
షూటింగ్ ముగించుకున్న తర్వాత, సెట్ లోనే కొందరు టెక్నీషియన్లతో రాజేష్ శర్మ మాట్లాడుతుండగా.. ఆయన కుడికాలు పాదం పై ఏదో ఒక కీటకం కుట్టినట్లు అనిపించిందట. ఆ సమయంలో సాధారణమైన పురుగే అనుకుని పెద్దగా పట్టించుకోలేదు, వైద్యులను కూడా సంప్రదించకుండా నిర్లక్ష్యం చేశారు. అయితే, ఆరు గంటల తర్వాత ఆయన కుడి కాలితో పాటు శరీరం అంతా తీవ్రంగా నొప్పులు ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది. ఈ విషయం గమనించిన వెంటనే రాజేష్ శర్మ హైదరాబాద్ నుంచి కలకత్తాకు బయలుదేరారు.
ఫ్లైట్ లో ఉండగానే ఆయనకు జ్వరంతో పాటు షుగర్ లెవెల్స్ కూడా అమాంతం పెరిగిపోయినట్లుగా తెలుస్తోంది. శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బందిగా మారడంతో పాటు, శరీరం పూర్తిగా సహకరించడం మానేసిందని ఆయన సన్నిహితులు పేర్కొన్నారు. కలకత్తా చేరుకున్న వెంటనే ఆయనను సన్నిహితులు ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.
ఒకరోజు గడిచినా జ్వరం తగ్గకపోగా.. శ్వాసకోశ సమస్యలు మరింత ఎక్కువయ్యాయని, ఆ పురుగు కుట్టిన పాదం నుంచి మోకాలి వరకు ఇన్ఫెక్షన్ చాలా వేగంగా పాకిపోయిందని తెలుస్తోంది. ప్రస్తుతం కలకత్తా వైద్య బృందం ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తోంది. ఇంకా పూర్తిగా ప్రమాదం నుంచి బయటపడలేదని డాక్టర్లు చెబుతున్నారు. పురుగు కాటు వేసిన భాగంలో రక్తం గడ్డకట్టకుండా ఉండేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒకవేళ ఈ ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తుల వరకు పాకితే ప్రాణాలకు సైతం ప్రమాదమని, అందుకే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU) లో ఉంచి ఆయనకు అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నట్లుగా తెలుస్తోంది.

