‘మండాడి’ సినిమా సక్సెస్ మీట్లో హీరో సుహాస్ రంగును ఉద్దేశించి దర్శకుడు మతిమారన్ పుగజేంధి చేసిన వ్యాఖ్యలు తెలుగు నాట తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలు మొత్తం తెలుగు ప్రేక్షకులను, టాలీవుడ్ను కించపరిచేలా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ మొదలైంది. వివాదం ముదరడంతో అప్రమత్తమైన దర్శకుడు మతిమారన్.. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా దిగొచ్చి వివరణ ఇచ్చారు. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సక్సెస్ మీట్లో సుహాస్ ఎదుర్కొన్న వర్ణ వివక్ష (రేసిజం) గురించి తాను మాట్లాడిన మాటలు కేవలం సుహాస్ను కించపరిచిన ‘ఆ ఒక్క వ్యక్తిని’ ఉద్దేశించినవి మాత్రమేనని మతిమారన్ స్పష్టం చేశారు. అంతేతప్ప, తన మాటలు ఏమాత్రం తెలుగు ప్రేక్షకులను, తెలుగు ప్రజలను లేదా సమస్త తెలుగు సినీ పరిశ్రమను ఉద్దేశించినవి కావని అన్నారు. సుహాస్కు మద్దతుగా మాత్రమే తాను ఆరోజు అలా మాట్లాడానని, ఒక కమ్యూనిటీని నిందించే ఉద్దేశం తనకు లేనే లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు.
తెలుగు ఇండస్ట్రీపై తనకు ఎంత గౌరవం ఉందో గుర్తుచేస్తూ.. “హైదరాబాద్లో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్లోనే నేను బహిరంగంగా ఒక మాట చెప్పాను. ఈరోజు దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమను లీడ్ చేస్తోంది తెలుగు ఇండస్ట్రీనే అని గర్వంగా చెప్పాను. తెలుగు పరిశ్రమ అన్నా, ఇక్కడి ప్రేక్షకులు అన్నా నాకు అపారమైన గౌరవం ఉంది. నాకు, నా ‘మండాడి’ సినిమాకు ఇంతటి అద్భుతమైన ప్రేమను పంచుతున్న తెలుగు ప్రజలకు వ్యతిరేకంగా నేను కావాలని ఎప్పటికీ ఒక్క మాట కూడా మాట్లాడను” అని మతిమారన్ తన వివరణలో పేర్కొన్నారు. ఒకవేళ తన మాటల వల్ల ఎవరైనా నొచ్చుకుని ఉంటే, లేదా తన ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకుని ఉంటే అందుకు తాను మనస్ఫూర్తిగా చింతిస్తున్నానని (Regret) మతిమారన్ విచారం వ్యక్తం చేశారు. తెలుగు సినిమా, తెలుగు ప్రేక్షకుల పట్ల తనకున్న ప్రేమ, ఆప్యాయత, గౌరవం ఎప్పటికీ చెక్కుచెదరవని ఆయన తన ప్రకటనలో ముగించారు. సుహాస్కు జరిగిన అవమానానికి స్టాండ్ తీసుకునే క్రమంలో వచ్చిన ఈ చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ను డైరెక్టర్ వెంటనే గుర్తించి క్లారిటీ ఇవ్వడంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్లేనని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

