Film Actor, Director Sreenivasan Passes Away: సినీ పరిశ్రమలో మరో విషాదకర ఘటన చోటు చేసుకుంది.. మలయాళ చిత్ర పరిశ్రమ నుండి విచారకరమైన వార్తలు వెలువడ్డాయి. ప్రముఖ నటుడు, స్క్రీన్ రైటర్, దర్శకుడు మరియు నిర్మాత శ్రీనివాసన్ కన్నుమూశారు.. ఆయన వయస్సు 69 సంవత్సరాలు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు శ్రీనివాసన్.. అయితే, శ్రీనివాసన్ చాలా కాలంగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని సమాచారం. అయితే, ఈ రోజు ఆయన మరణించారు. శ్రీనివాసన్ ఆకస్మిక మరణంతో ఆయన కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. పరిశ్రమ కూడా శోకసంద్రంలో మునిగిపోయింది. అభిమానులు, ప్రముఖులు సహా ప్రతి ఒక్కరూ కన్నీటి నివాళులర్పిస్తున్నారు..
Read Also: Imran Khan: ఇమ్రాన్ ఖాన్కు మరో బిగ్ షాక్.. అవినీతి కేసులో 17 ఏళ్లు జైలు శిక్ష
శ్రీనివాసన్.. మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రఖ్యాత నటుడిగా ఎదిగారు.. ఆయన 48 సంవత్సరాల సినీ కెరీర్లో 200కి పైగా సినిమాల్లో నటించారు. శ్రీనివాసన్ సినిమాలు సామాన్యుల సమస్యలను తేలికగా చిత్రీకరించడానికి ప్రసిద్ధి చెందాయి. ఆయన నటన చాలా ప్రామాణికమైనది, ఆయన పాత్రలు ప్రతి ఒక్కటి ప్రజల హృదయాలను తాకాయి. ఆయన ప్రతి పాత్రకు ప్రాణం పోశారు. నేటికీ ప్రజాదరణ పొందిన కొన్ని చిరస్మరణీయ మలయాళ చిత్రాలను కూడా ఆయన రచించి దర్శకత్వం వహించారు. నటన మరియు రచనతో పాటు, శ్రీనివాసన్ “వడక్కునొక్కియంత్రం” మరియు “చింతవిష్టాయ శ్యామల” వంటి అద్భుతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు.
శ్రీనివాసన్ కు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ఆయన పెద్ద కుమారుడు వినీత్ శ్రీనివాసన్ ఒక ప్రముఖ గాయకుడు, దర్శకుడు, నటుడు కాగా.. చిన్న కుమారుడు ధ్యాన్ శ్రీనివాసన్ కూడా ఒక నటుడు మరియు దర్శకుడు.. వారి తండ్రి మరణంతో ఆ కుటుంబానికి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.. మరోవైపు, మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రఖ్యాత నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రముఖ నటుడు శ్రీనివాసన్ మరణ వార్త విని తన విచారాన్ని వ్యక్తం చేశారు. ఆయన తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో “గొప్ప రచయిత, దర్శకుడు మరియు నటుడికి వీడ్కోలు. నవ్వులు మరియు ఆలోచనలకు ధన్యవాదాలు” అని రాస్తూ ఒక పోస్ట్ను పంచుకున్నారు. ఇక, చాలా మంది చిత్ర పరిశ్రమకు చెందినవారు శ్రీనివాసన్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు..