‘కేజీఎఫ్’ మూవీతో ఓవర్ నైట్ ఆలిండియాలో మాస్ హీరో గా పేరు తెచ్చుకున్నాడు కన్నడ హీరో యశ్. నిజానికి అందులో మాస్ క్యారెక్టర్ ను సైతం ఎంతో క్లాస్ గా, సెటిల్డ్ గా చేయడంతో అందరి మనసుల్ని గెలుచుకున్నాడు. ప్రస్తుతం యశ్ ‘కేజీఎఫ్’ చాప్టర్ 2 రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తయిపోయిన ఈ సినిమాలో ఉత్తరాదికి చెందిన సంజయ్ దత్, రవీనాటాండన్ వంటి వారూ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ తర్వాత యశ్ తెలుగు స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మూవీలో నటించబోతున్నాడని శాండిల్ ఉడ్ లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ‘కేజీఎఫ్’ తరహాలోనే దీన్నీ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తారట.
పూరి జగన్నాథ్ ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో విజయ్ దేవరకొండతో ‘లైగర్’ మూవీ చేస్తున్నాడు. ఆ తర్వాత యశ్ మూవీనే సెట్స్ పైకి వెళుతుందని అంటున్నారు. నిజానికి పూరి ఇటు కన్నడంలోనూ, అటు హిందీలోనూ చిత్రాలు చేయడం ఇదే మొదటిసారి కాదు. 2001లోనే శివరాజ్ కుమార్ తో కన్నడలో ‘యువరాజ్’ మూవీ చేశాడు పూరి. తెలుగు ‘తమ్ముడు’కు ఇది రీమేక్. అలానే ఆ తర్వాత సంవత్సరం శివరాజ్ కుమార్ సోదరుడు పునీత్ హీరోగా ‘అప్పు’ మూవీ చేశాడు. అదే తెలుగులో ఆ తర్వాత సంవత్సరం ‘ఇడియట్’గా రీమేక్ అయ్యింది. ఇక తెలుగులో తాను తెరకెక్కించిన ‘బద్రీ’ మూవీని హిందీలో 2004లో ‘షర్త్’ పేరుతో రీమేక్ చేశాడు. సో… కాస్తంత ఆలస్యం ఆ రెండు చిత్రసీమల్లోకి పూరి రీ-ఎంట్రీ ఇస్తున్నాడంతే! ఇదిలా ఉంటే… ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ టాలీవుడ్ పై దృష్టి పెట్టడం పెద్ద చర్చకే దారితీస్తోంది. ఇప్పటికే ప్రభాస్ తో ‘సలార్’ చేస్తున్న ప్రశాంత్ నీల్ ఆ తర్వాత ఎన్టీయార్ తో మూవీ చేయబోతున్నాడు. అలానే రాబోయే రోజుల్లో మహేశ్ బాబు, రామ్ చరణ్ మూవీస్ కూడా అతను చేసే ఆస్కారం ఉందని తెలుస్తోంది. మొత్తం మీద ప్రశాంత్ నీల్ ఇటు వస్తుంటే… పూరి అటు వెళుతున్నాడు.