ఒక ప్రేమ వివాహం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల మధ్య నడుస్తున్న ఈ హైడ్రామాలో కేరళ గత టర్మ్ అధికార కమ్యూనిస్ట్ పార్టీ (CPI-M) అగ్రనేతలు, ఏకంగా ఒక రాష్ట్ర మంత్రి చట్టపరమైన ఇబ్బందుల్లో పడేలా కనిపిస్తున్నారు. పూసల మోనాలిసా పెళ్లి సమయానికి మైనర్ అనే ఆరోపణలు రావడం, దీనిపై జాతీయ ఎస్టీ కమిషన్ (NCST) రంగంలోకి దిగడంతో ఈ వ్యవహారం ముదిరి పాకాన పడింది. మొనాలీసా భోస్లే, ఫర్మాన్ కేరళ మ్యారేజ్ రూల్స్ ప్రకారం వివాహం చేసుకున్నారు. అయితే, పెళ్లి సమయానికి మొనాలీసా వయస్సు కేవలం 16 సంవత్సరాలేనని, ఆమెకు చట్టబద్ధంగా వివాహ వయస్సు రాలేదనే ఆరోపణలు వెల్లువెత్తాయి. బాల్య వివాహమే కాకుండా, ఇందులో ‘పోక్సో’ చట్టం కింద నేరం జరిగిందనే అనుమానాలు వ్యక్తమవడంతో ఈ వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది. దీనిపై మధ్యప్రదేశ్ లో సదరు యువతి తండ్రి ఫిర్యాదు చేయడంతో కిడ్నాప్ కేసు కూడా నమోదైంది.
మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో ఈ దంపతులు కేరళ హైకోర్టును ఆశ్రయించారు. తాము మేజర్లు అయ్యాకే పెళ్లి చేసుకున్నామని నిరూపించడానికి మొనాలీసాకు సంబంధించిన పాన్ కార్డ్, ఓటర్ ఐడీ, జనన ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డ్ వంటి కీలక పత్రాలను కోర్టు ముందుంచారు. ఈ ఏడాది జనవరి నాటికే ఆమెకు 18 ఏళ్లు నిండాయని వారు వాదిస్తున్నారు. మొదట్లో తమ పెళ్లికి అమ్మాయి కుటుంబం అంగీకరించిందని, కానీ ఒక బంధువు ఒత్తిడి వల్లే ఇప్పుడు కేసుల వరకు తెచ్చారని వారు తమ పిటిషన్లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఈ కేసులో మరో ఊహించని మలుపు తిరిగింది. తనను మైనర్గా చూపిస్తూ, తమ పెళ్లిని రద్దు చేయాలనే కుట్రతో అధికారులు తన వయస్సు రికార్డులను తారుమారు చేశారంటూ మొనాలీసా ఇటీవల మధ్యప్రదేశ్ హైకోర్టును కూడా ఆశ్రయించడం విశేషం. అయితే ఈ పెళ్లిని దగ్గరుండి జరిపించారనే ఆరోపణలపై కేరళకు చెందిన ప్రముఖ రాజకీయ నేతలపై ప్రైవేట్ ఫిర్యాదు నమోదైంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఎం.వి. గోవిందన్, కేరళ విద్యాశాఖ మంత్రి వి. శివన్కుట్టి, రాజ్యసభ ఎంపీ ఏ.ఏ. రహీమ్లపై చర్యలు తీసుకోవాలని తిరువనంతపురంలోని పోక్సో కోర్టులో దాఖలైన పిటిషన్లో కోరారు. దీనిపై స్పందించిన కోర్టు.. యువతి వయస్సుపై దర్యాప్తు ఏ స్థితిలో ఉందో నివేదిక ఇవ్వాలని మధ్యప్రదేశ్ పోలీసులను ఆదేశించింది.
