ఇండియన్ చలనచిత్ర పరిశ్రమలో ‘మ్యాస్ట్రో’గా, సంగీత ప్రపంచపు సార్వభౌముడిగా వెలుగొందుతున్న లెజెండరీ సంగీత దర్శకుడు ఇళయరాజా (Ilaiyaraaja) పేరు కోలీవుడ్లో మరోసారి హాట్ టాపిక్గా మారింది. గత కొన్నేళ్లుగా పలు కాపీరైట్ వివాదాలు, లీగల్ నోటీసుల వల్ల వార్తల్లో నిలిచిన ఇళయరాజా.. తాజాగా సూర్య – త్రిష కాంబినేషన్లో బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న బ్లాక్బస్టర్ హిట్ ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’) వివాదంలోకి లాగబడ్డారు. ఈ నేపథ్యంలో..
చిత్ర నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేస్తూ ఇళయరాజాకు బహిరంగ క్షమాపణలు చెప్పడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఈ సినిమా సెకండాఫ్ (Second Half) లో వచ్చే ఒక కీలక సన్నివేశంలో ఇళయరాజాను ఉద్దేశించి వచ్చే ఒక డైలాగ్ పెద్ద వివాదానికి దారితీసింది. ఆ సీన్ రాజా స్థాయికి ఎంతో అనుచితంగా, ఆయనను కించపరిచేలా ఉందంటూ ఇటు ఇళయరాజా అభిమానుల నుండి, అటు సినీ వర్గాల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. వివాదం ముదురుతోందని గ్రహించిన మేకర్స్ వెంటనే రంగంలోకి దిగి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు..
‘మా ‘కరుప్పు’ సినిమాలో సెకండాఫ్లో వచ్చే ఒక సన్నివేశంలో మ్యాస్ట్రో ఇళయరాజా గారి ప్రస్తావన వస్తుంది. అయితే, ఆ సీన్ను మేము కేవలం హాస్యం (సందర్భోచితం) కోసమే రాసుకున్నాము తప్ప.. కోట్లాది మంది గుండెల్లో కొలువైన ఇళయరాజా గారి గౌరవ మర్యాదలకు భంగం కలిగించాలనే ఉద్దేశం మాకు ఎంతమాత్రం లేదు. ఈ సీన్ వల్ల రాజా గారి మనోభావాలు, అలాగే ఆయన అభిమానుల మనసులు నొచ్చుకున్నందుకు మేము హృదయపూర్వకంగా క్షమాపణలు (Apology) కోరుతున్నాము. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటాము’ అని తెలిపారు. ప్రస్తుతం ఈ అఫీషియల్ ప్రెస్ నోట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
#Pressrelease #PublicAnnouncement #Karuppu #MaestroIlayaraaja pic.twitter.com/hdgP3wZhBL
— DreamWarriorPictures (@DreamWarriorpic) May 19, 2026
