పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్లాక్బస్టర్ హిట్ ‘గబ్బర్ సింగ్’ ద్వారా గుర్తింపు పొందిన నటుడు రమేష్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆయన హఠాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్కు గురికావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ను హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఈ వార్త తెలియడంతో టాలీవుడ్ వర్గాలు, పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్రెయిన్ స్ట్రోక్ రావడం వల్ల రమేష్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో, అపోలో ఆసుపత్రి వైద్యులు ఆయన్ను అత్యవసర వైద్య విభాగంలో (ICU) ఉంచి చికిత్స అందిస్తున్నారు. రమేష్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా ఉందనీ, ఆయన కోలుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నామని అపోలో వైద్య వర్గాలు వెల్లడించాయి.
హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సినిమాలో పవన్ కళ్యాణ్తో కలిసి నటించిన పోలీస్ స్టేషన్ కామెడీ గ్యాంగ్లో రమేష్ ఒకరిగా నటించి ప్రేక్షకులను అలరించారు. ఆ సినిమాలో తనదైన శైలిలో నటనతో అందరి దృష్టిని ఆకర్షించి ‘గబ్బర్ సింగ్ రమేష్’గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరువాత ఆ గుర్తింపుతో ఎన్నో సినిమాల్లో కూడా నటించారు. ఇక హఠాత్తుగా ఆయన బ్రెయిన్ స్ట్రోక్కు గురై చావుబతుకుల మధ్య పోరాడుతుండటంతో చిత్రపరిశ్రమకు చెందిన పలువురు నటులు, సాంకేతిక నిపుణులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. రమేష్ త్వరగా కోలుకుని పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ప్రార్థిస్తున్నారు.

